ముంబైని ముంచిన వాన... విడవని గండం... అత్యవసరమైతే తప్ప జనం బయటకు రావొద్దు...
ముంబైలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. సోమవారం(అగస్టు 3) రాత్రి నుంచి మంగళవారం ఉదయం వరకూ ఎడతెరిపిలేకుండా కురిసిన భారీ వర్షంతో చాలా ప్రాంతాలు జలమయం అయ్యాయి. 2005 తర్వాత ముంబైలో ఇంత భారీ వర్షం నమోదవడం ఈసారేనని మహారాష్ట్ర మంత్రి ఆదిత్య థాక్రే అన్నారు. కేవలం నాలుగు గంటల వ్యవధిలోనే 198మి.మీ వర్షపాతం నమోదైందని.. ప్రపంచంలో మరే నగరమైనా ఇంత భారీ వర్షానికి ధ్వంసమైపోయేదని అన్నారు. ముంబైతో పాటు తూర్పు కొంకణ్, థానే జిల్లాల్లోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది.

లోకల్ ట్రైన్స్ రద్దు...
భారీ వర్షాల నేపథ్యంలో అత్యవసర సేవల విభాగాలు తప్ప అన్ని రకాల కార్యాలయాలు,షాపులు మూసివేస్తున్నట్లు ముంబై మున్సిపల్ అధికారులు తెలిపారు. కరోనా కారణంగా తక్కువ సంఖ్యలో నడుపుతున్న ముంబై లోకల్ ట్రైన్స్ను వర్షాల కారణంగా కొన్ని రూట్లలో పూర్తిగా రద్దు చేస్తున్నట్లు చెప్పారు. వర్షంతో ఎక్కువగా ఎఫెక్ట్ అయిన పలు ప్రాంతాల్లో బస్సు సర్వీసులను కూడా వేరే మార్గాల్లోకి మళ్లించినున్నట్లు తెలిపారు. ముంబై విమానాశ్రయ కార్యకలాపాలపై వర్షం ఎలాంటి ప్రభావం చూపలేదని అన్నారు.
నాలాలో కొట్టుకుపోయిన మహిళ,ఇద్దరు చిన్నారులు...
ముంబైలోని ఓ ప్రాంతంలో భారీ వర్షాలకు నాలా ఉప్పొంగి ఓ ఇల్లు కూలిపోవడంతో... ఆ ఇంట్లోని 35 ఏళ్ల మహిళ,ఆమె ముగ్గురు పిల్లలు అందులో కొట్టుకుపోయారు. ఇందులో ఒక చిన్నారిని పోలీస్ అధికారులు రక్షించగా మిగతావారు గల్లంతయ్యారు. ప్రస్తుతం వారి కోసం గాలింపు చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి.

230మి.మీ భారీ వర్షపాతం..
సోమవారం రాత్రి 7గంటల సమయంలో భారీ వర్షం మొదలైంది. మంగళవారం ఉదయం 5గం.-6గం. సమయంలో కాస్త ఎడతెరిపినిచ్చింది. మొత్తం 10 గం. పాటు నిరంతరాయంగా భారీ వర్షం కురవడంతో 230మి.మీ వర్షపాతం నమోదైంది. నగరంలోని మిథీ నది భారీ వర్షానికి ఉప్పొంగి డేంజర్ మార్క్ 34మీటర్లకి చేరింది. దీంతో లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నట్లు బృహన్ ముంబై కార్పోరేషన్ చీఫ్ ఇక్బాల్ సింగ్ చహల్ తెలిపారు.
Recommended Video

అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దు...
ముంబైలోని 26 ప్రాంతాలు వర్షం ధాటికి వరదలతో పోటెత్తాయి. గోరెగావ్,కింగ్ సర్కిల్,హింద్మాతా,దాదర్,శివాజీ చౌక్,షెల్ కాలనీ,కుర్ల ఎస్టీ డిపో,బాంద్రా టాకీ,సియోన్ రోడ్ ప్రాంతాలు జలమయం అయ్యాయి. కందివలిలో మంగళవారం ఉదయం ఎక్స్ప్రెస్ హైవేపై కొండ చర్య విరిగిపడటంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. వర్ష ప్రభావం నేపథ్యంలో ప్రజలు అత్యవసరమైతే తప్ప గడప దాటకూడదని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. దాదాపుగా ప్రతీ ఏడాది వర్షాకాలంలో ముంబైని భారీ వానలు ముంచెత్తుతున్నాయి.












Click it and Unblock the Notifications