రాజీవ్ హత్య కేసు: దోషుల విడుదలపై సుప్రీం కోర్టు స్టే
న్యూఢిల్లీ: మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసులో నలుగురు దోషుల విడుదలపై తమిళనాడు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై సుప్రీం కోర్టు స్టే విధిస్తూ తీర్పునిచ్చింది. మార్చి 6వ తేదీ వరకూ ఈ స్టేను విధిస్తున్నట్లు గురువారం ఇచ్చిన తన తీర్పులో సుప్రీంకోర్టు పేర్కొంది.
దోషుల విడుదల చేస్తామంటూ తమిళనాడులోని ముఖ్యమంత్రి జయలలిత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఇటీవల సుప్రీం కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. కేంద్రం పిటిషన్పై విచారణ జరిపిన సుప్రీం కోర్టు తమిళనాడు ప్రభుత్వ నిర్ణయంపై స్టే విధించింది.

రాజీవ్ హత్యకేసులో దోషులైన నలుగురి విడుదలను నిలపుదల చేస్తూ పి సదాశివం నేతృత్వంలోని సుప్రీం కోర్టు బెంచ్ ఆదేశాలు జారీ చేసింది. రాజీవ్ గాంధీ హంతకుల విడుదల విషయంలో తమిళనాడు ప్రభుత్వం సంయమనం పాటించాలని నోటీసులు ఇచ్చింది. రాజీవ్ గాంధీ హత్యకేసులో దోషులు జీవిత ఖైదును అనుభవిస్తున్న విషయం తెలిసిందే.
తమిళనాడులోని పెరంబుదూరులో 1991, మే 21న ఆత్మాహుతి దాడిలో అనాటి ప్రధాని రాజీవ్ గాంధీతోపాటు 14 మంది తమ ప్రాణాలను కోల్పోయారు. అనేకమంది గాయాలపాలయ్యారు. కాగా ఎన్నికల్లో లబ్ధి పొందడానికే తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత రాజీవ్ హంతకులను విడుదల చేసేందుకు ఆసక్తి చూపుతున్నట్లు పలువురు కాంగ్రెస్ నాయకులు ఆరోపిస్తున్నారు.












Click it and Unblock the Notifications