టిడిపితో పొత్తుపై రాజ్: టి, సీమాంధ్రను కలిపేస్తారని గాలి
హైదరాబాద్: రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీతో పొత్తు విషయమై భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు రాజ్ నాథ్ సింగ్ మంగళవారం స్పందించారు. హైదరాబాదులోని బహిరంగ సభ కోసం వచ్చిన రాజ్ పొత్తులపై స్పందించారు. తాము టిడిపితో పొత్తు విషయమై ఇంకా నిర్ణయం తీసుకోలేదన్నారు.
ఎవరితో పొత్తు పెట్టుకోవాలనే విషయమై జాతీయస్థాయిలో చర్చలు జరుపుతామన్నారు. ఇప్పటి వరకు ఎపిలో ఏ పార్టీతోను పొత్తు పెట్టుకోలేదని చెప్పారు. తమతో పొత్తు కోసం చాలా పార్టీలు ఆసక్తి చూపిస్తున్నాయని రాజ్ నాథ్ సింగ్ తెలిపారు.

మరోవైపు టిడిపి అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు పార్టీ నేతలకు బిజెపితో పొత్తుపై సూచనలు చేసినట్లుగా తెలుస్తోంది. స్థానిక, మున్సిపల్ ఎన్నికల్లో బిజెపితో కలిసి వెళ్లాలని సూచించారట. వామపక్షాలతో కలిసి వెళ్లే అవకాశం లేదని, స్థానికంగా బిజెపితో ఇబ్బందులు ఉంటే తన దృష్టికి తీసుకు రావాలని చెప్పారట.
బాబు నాయకత్వంలో టి, సీమాంధ్ర ఏకం: గాలి
తమ పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రెండు రాష్ట్రాలు తిరిగి ఏకమవుతాయని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత గాలి ముద్దుకృష్ణమ నాయుడు అన్నారు. కిరణ్ కుమార్ రెడ్డి కొత్త పార్టీని తాము గుర్తించమన్నారు. సోనియా గాంధీ ఆదేశాల మేరకు కిరణ్ పార్టీ పెట్టి డ్రామాలు ఆడుతున్నారని ధ్వజమెత్తారు. మరో ఐదేళ్ల తర్వాత సీమాంధ్రలో కలపాలని తెలంగాణ ప్రజలు ఉద్యమిస్తారన్నారు.
అధికారంలో ఉన్నప్పుడు విభజన ఆపలేని కిరణ్ ఇప్పుడు ప్రగల్బాలు పలుకుతున్నారన్నారు. జై సమైక్యాంధ్ర పార్టీ నేతలకు ప్రజలు తెగిపోయిన చెప్పుల దండను వేస్తారని ఘాటుగా వ్యాఖ్యానించారు. రాష్ట్రం విడిపోవడానికి కిరణే కారణమన్నారు. ఇంకా లాస్ట్ బాల్ ఉందని కిరణ్ అంటున్నాడని... బ్యాట్, బాల్ రెండూ సోనియాకు అప్పగించిన తర్వాత... ఇంకొక బాల్ ఎక్కడ నుంచి వస్తుందని ఎద్దేవా చేశారు.
తమ పార్టీ ఇప్పటి వరకు పొత్తుల పైన దృష్టి సారించలేదన్నారు. వచ్చే నెల 6వ తేదీ తర్వాత పొత్తులపై స్పష్టత వస్తుందన్నారు. కొత్త పార్టీలు తమకు మద్దతివ్వాలన్న చంద్రబాబు వ్యాఖ్యలపై గాలి వివరణ ఇచ్చారు. చంద్రబాబు చెప్పింది పవర్ స్టార్ పవన్ కల్యాణ్ గురించి అన్నారు.












Click it and Unblock the Notifications