శ్రీరాముడికి కులం లేదు.. అందుకే అయోధ్య ట్రస్టులో ఓబీసీలకు చోటులేదు: విశ్వహిందూ పరిషత్
అయోధ్యలోని రామజన్మభూమిలో ఆలయ నిర్మాణం పనులు ప్రారంభంకావడానికి ముందే వివాదాలు రేగుతున్నాయి. బాబ్రీ మసీదు కూల్చివేతలో కీలకంగా వ్యవహరించిన సన్యాసిని, ఆ తర్వాత కేసులు కూడా ఎదుర్కొంటున్న కేంద్ర మాజీ మంత్రి ఉమా భారతి.. మందిరం ట్రస్టును ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు దుమారానికి దారితీశాయి. అయోధ్యలో మందిర నిర్మాణం కోసం ''శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర''పేరుతో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటుచేసిన ట్రస్టులో ఇతర వెనుకబడిన కులాలు(ఓబీసీ)లకు కూడా చోటు కల్పించాలని, ట్రస్టుకు ఓబీసీలే ముఖచిత్రంగా ఉండేలా చూడాలని ఆమె సూచించారు.

కుదరదన్న పెద్దలు..
ఉమా భారతి ‘ఓబీసీ' సూచనపై విశ్వ హిందూ పరిషత్(వీహెచ్పీ) ఘాటుగా స్పందించింది. ‘‘శ్రీరాముడు ఏ ఒక్క కులానికో చెందినవాడు కాదు. భగవంతుడికి కులం లేదని భావించాలి. అలాంటప్పుడు మందిరం ట్రస్టులో ప్రత్యేకంగా ఓబీసీలకు చోటు కల్పించాలని ఉమా భారతి ఎలా అంటారు? దేవుడు ఏ కులానికి చెందనివాడు కాబట్టి ట్రస్టులో ఓబీసీలకు అవకాశం సాధ్యమయ్యేపనికాదు''అని వీహెచ్పీ జనరల్ సెక్రటరీ సురేంద్ర జైన్ అన్నారు. మందిర నిర్మాణం ఈసమయానికి కచ్చితంగా పూర్తవుతుందని చెప్పలేనప్పటికీ గరిష్టంగా నాలుగేళ్లలో భక్తులకు ఆలయం అందుబాటులోకి వస్తుందని ఆయన చెప్పారు.

మసీదు కూల్చాం.. మాకు చోటేది?
ఉమా భారతి ఓబీసీ వివాదానికి తోడు ఇంకొన్ని హిందూ సంస్థలు కూడా ట్రస్టు ఏర్పాటు ప్రక్రయపై అసంతృప్తి వెళ్లగక్కుతున్నాయి. రామజన్మభూమి న్యాస్ అధ్యక్షుడు మహంత్ నృత్య గోపాల్ దాస్, మరో హిందూ ఉద్యమకారుడు చంపత్ రాయి సైతం ట్రస్టులో చోటు దక్కకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మందిర ఉద్యమ ప్రారంభం నుంచి మసీదు కూల్చివేత దాకా, ఆ తర్వాత న్యాయపోరాటంలోనూ కీలకంగా భాగం పంచుకున్న తమకు అయోధ్య మందిరం ట్రస్టులో చోటు కల్పించకపోవడం అన్యాయమని వారు ఆరోపించారు.

15 మందితో ట్రస్టు..
చారిత్రక అయోధ్య నగరంలో రామ మందిర నిర్మాణం కోసం ‘‘శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర'' పేరుతో ట్రస్టును ఏర్పాటుచేస్తున్నట్లు ప్రధాని మోదీ పార్లమెంటులో ప్రకటించడం తెలిసందే. మొత్తం 15 మంది సభ్యులుండే ట్రస్టుకు.. సీనియర్ అడ్వొకేట్ పరాశరన్ చైర్మన్ గా వ్యవహరిస్తారు. అయోధ్యలోని 67.7 ఎకరాల భూమిలో ఆలయ నిర్మాణం, నిర్వహణ వ్యవహారాలన్నీ ట్రస్టే చూసుకుంటుంది.












Click it and Unblock the Notifications