అయోధ్యలో రామాలయం నిర్మిస్తాం, హిందూ-ముస్లీం నేతల చర్చ: కేంద్రమంత్రి
లక్నో: అయోధ్యలో రామ మందిరం అధికార భారతీయ జనతా పార్టీ వెనక్కి తగగ్లేదని, కచ్చితంగా ఆలయ నిర్మాణం జరుగుతుందని కేంద్రమంత్రి హన్స్రాజ్ గంగారామ్ ఆహిర్ సోమవారం అన్నారు. రామాలయ అంశం అనేది మన గౌరవ ప్రతిష్ఠలకు సంబంధించిన అంశమన్నారు. ఇతర మార్గాల ద్వారా దానిని నిర్మిస్తామన్నారు.
రామాలయ నిర్మాణ విషయంలో బీజేపీ వెనుకంజ వేయలేదన్నారు. రామాలయ నిర్మాణ అంశం బీజేపీ ఎన్నికల ప్రణాళికలో లేకపోయినప్పటికీ ఇది మన గౌరవ మర్యాదలకు సంబంధించిన విషయమన్నారు. అయోధ్యలో రామాలయ నిర్మాణ విషయమై సాధువులు తమపని తాము చేసుకుపోతున్నారన్నారు.
ఈ విషయమై హిందూ, ముస్లిం నాయకులు కూడా ప్రభుత్వంతో సమావేశమవుతున్నారని చెప్పారు. ఈ విషయమై ఆయనను మరింత లోతుగా ప్రశ్నించగా... అయోధ్యలో జరిగేది మసీదు నిర్మాణం కాదని, ఎప్పటికైనా అక్కడ ఆలయాన్నే నిర్మించాలన్న విషయం నిర్ణయమైపోయిందన్నారు. ఇతర పద్ధతుల్లో దీనిని నిర్మించడం జరుగుతుందన్నారు. అయితే ఇందుకు సంబంధించి మరిన్ని వివరాలను వెల్లడించేందుకు ఆయన నిరాకరించారు.
కాగా, బీజేపీ ఎంపీ సాధ్వీ ప్రాచి కూడా ఖాన్ త్రయంపై మండిపడిన విషయం తెలిసిందే. బాలీవుడ్ స్టార్లు షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్ నటించిన చిత్రాలను బహిష్కరించాలని పిలుపునిచ్చారు. వీరి సినిమాలకు సంబంధించిన వాల్పోస్టర్లను చించి, దగ్ధం చేయాలని ఆమె హిందూ సంస్థలకు సూచించారు. మతపరమైన సేవా కార్యక్రమాల పేరుతో ప్రజలను క్రైస్తవ మతం వైపు ఆకర్షించి థెరిస్సా మతమార్పిడులకు పాల్పడ్డారని ప్రాచి విమర్శించారు.