షాకింగ్:అయోధ్యలో టైమ్ క్యాప్సుల్ వట్టిదే - ఫేక్ న్యూస్ నమ్మొద్దన్న ట్రస్ట్ - అసలేం జరిగిందంటే..
అయోధ్యలో భవ్య రామ మందిర నిర్మాణానికి అంగరంగ వైభవంగా ఏర్పాట్లు జరుగుతుండగా.. సడెన్ గా తెరపైకొచ్చిన 'కాల నాళిక (టైమ్ క్యాప్సుల్)' అంశం తీవ్ర గందరగోళానికి దారి తీసింది. కొత్తగా నిర్మించబోయే ఆలయానికి 2 వేల అడుగుల లోతులో టైమ్ క్యాప్సుల్ ఏర్పాటు చేస్తామంటూ వెలువడిన ప్రకటన.. రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు సభ్యుల మధ్య విభేధాలకు కారణమైంది. మొత్తంగా టైమ్ క్యాప్సుల్ పై వచ్చిన రిపోర్టులు, వార్తలన్నీ పుకార్లేనని, ఫేక్ న్యూస్ ను ప్రజలు నమ్మొద్దని ట్రస్ట్ సెక్రటరీ చంపత్ రాయ్ మంగళవారం మీడియాకు క్లారిటీ ఇచ్చారు.

అసలేం జరిగిందంటే..
అయోధ్యలో భవ్య రామ మందిర నిర్మాణం కోసం ఆగస్టు 5న భూమి పూజ జరుగనుంది. సంబంధిత ఏర్పాట్లపై.. ట్రస్టులో ఏకైక దళిత సభ్యుడైన కామేశ్వర్ చౌపాల్ సోమవారం మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మందిరం నిర్మాణంలో మరో విశేషం చోటుచేసుకోబోతున్నదని, ఆలయ భూగర్భంలో రామ జన్మభూమికి సంబంధించిన సమస్త చరిత్రను నిక్షిప్తం చేస్తామని, భవిష్యత్తులో ఎలాంటి వివాదాలు తలెత్తకుండా ఉండేలా ఓ కాల నాళిక(టైమ్ క్యాప్సూల్)ను ఏర్పాటు చేస్తామని తెలిపారు.

తామ్ర పత్రంలో భద్రపరుస్తామంటూ..
రామ మందిరంపై సుప్రీంకోర్టులో సుదీర్గకాలం వివాదం కొనసాగిందని, దాన్ని దృష్టిలో ఉంచుకుని, రాబోయే తరాలకు ఒక పాఠంగా.. ఆలయ చరిత్ర, కీలక పరిణామాలతో కూడిన సమగ్ర సమాచారాన్ని కాల నాళికలో పొందుపరుస్తామని, తామ్ర పత్రంలో(కాపర్ ప్లేట్) ఉంచి భూగర్భంలో భద్రపరుస్తామని కామేశ్వర్ చౌపాల్ వివరించారు. భవిష్యత్తులో రామాలయం గురించి ఎవరైనా అధ్యయనం చేయడానికి ఈ టైమ్ క్యాప్సుల్ ఉపయోగపడుతుందని, అప్పుడు వాస్తవాలు వక్రీకరణకు గురయ్యే అవకాశం ఉండదని, తద్వారా వివాదాలకు తావుండదని ఆయన చెప్పారు. అంతేకాదు, శ్రీరాముడు నడయాడినట్లుగా ఆధారాలున్న అన్ని పుణ్య క్షేత్రాలు, పవిత్ర నదుల నుంచి మట్టి, నీరు తెప్పిస్తున్నామని, ఆగస్టు 5న జరిగే భూమి పూజలో వాటిని వాడతామని చౌపాల్ తెలిపారు.

నిమిషాల్లో వైరల్.. రోజులో ఖండన..
మందిరం అడుగు భాగంలో టైమ్ క్యాప్సుల్ ఏర్పాటు చేస్తామన్న ట్రస్టు సభ్యుడి ప్రకటన నిమిషాల వ్యవధిలోనే వైరల్ అయింది. దేశంలోని చిన్నా, పెద్దా మీడియా సంస్థలు, సోషల్ మీడియాలో ఈ వార్తలు విపరీతంగా షేర్ అయ్యాయి. అసలు ఈవెంట్ కంటే టైమ్ క్యాప్సుల్ వ్యవహారం చర్చనీయాంశం కావడంతో రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు క్లారిటీ ఇచ్చింది. ట్రస్టు సెక్రటరీ చంపత్ రాయ్ మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. కామేశ్వర్ చౌపాల్ ప్రకటనతో విభేదించారు. ఆలయానికి సంబంధించి అనధికారికంగా వెలువడే ప్రకటనల్ని ప్రజలు నమ్మొద్దని, అడుగు భాగంలో ఎలాంటి టైమ్ క్యాప్సుల్ ఏర్పాటు చేయబోవడంలేదని రాయ్ కుండబద్దలు కొట్టారు.

అయోధ్య భూమిపూజకు ముస్లింలు..
ఆగస్టు 5న అయోధ్యలో భవ్య రామ మందిరం భూమి పూజలో ముంస్లింలు సైతం పెద్ద సంఖ్యలో పాల్గొననున్నారు. ఛత్తీస్గఢ్కు చెందిన ఫయాజ్ ఖాన్ కాలినడకన అయోధ్యకు బయలుదేరి పతాక శీర్శికలకు ఎక్కాడు. ఆలయ నిర్మాణానికి ఇటుకలను కూడా ఆయన మోసుకెళుతున్నారు. ఫయాజ్ లాగే దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి ముస్లింలు అయోధ్యకు పయనమయ్యారు. వాళ్లలో రాజా రయీస్, వాసీ హైదర్, హజీ సయీద్, జంషెడ్ ఖాన్, ఆజం ఖాన్ తదితరులున్నారు. తాము రాముడిని ‘ఇమామ్-ఎ-హింద్'గా భావిస్తామని వారంతా అంటున్నారు.
Recommended Video

అయోధ్య ఆహ్వానితుల్లో అంబానీ..
దాదాపు రూ.500 కోట్ల వ్యయంతో అయోధ్యలో నిర్మించబోయే భవ్య రామ మందిరం కొత్త డిజైన్కు శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు ఈ నెల 18న ఆమోదం తెలిపింది. 161 అడుగుల ఎత్తులో నిర్మించనున్న ఈలయానికి అదనంగా మూడు మంటపాలనూ ఏర్పాటు చేస్తామని, మొత్తం 366 స్తంభాలను వాడుతామని ప్రధాన శిల్పి సీఎస్ సోంపూరా తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్యఅతిథిగా, ఆగస్టు 5న అయోధ్య భూమి పూజ జరుగనుంది. ఈ వేడుకకు.. వివిధ రంగాలకు చెందిన సుమారు 200 మంది ప్రముఖుల్ని ట్రస్టు ఆహ్వానించింది. అందులో రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ, అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ కూడా ఉన్నట్లు తెలిసింది. మందిరం ఉద్యమంతో సంబంధమున్న కీలక నేతలు కూడా వేడుకకు హాజరుకానున్నారు.












Click it and Unblock the Notifications