ఎవరి ప్రయోజనం కోసం పుత్ర జీవక్? : ఇది లింగ వివక్ష కాదా?
న్యూఢిల్లీ : ఈ-కామర్స్ దిగ్గజం ఈబే.ఇన్ లో ఓ యాడ్ కనిపించింది. అదేంటంటే.. పతంజలి సంస్థ వారు ఉత్పత్తి చేస్తోన్న 'దివ్య పుత్రజీవక్ బీజ్ సీడ్' రూ.500 అని. అంటే.. ఈ 500 మనిషి పుట్టుకను నిర్దేశిస్తాయా..? కడుపులో పిండాన్ని పొరపాటున కూడా ఆడగా.. వృద్ది చెందనీయకుండా.. మగ పిల్లలే ఉత్పత్తి అయ్యేలా పుట్టుకను సైతం నియంత్రిస్తాయా?.
దీని పనితనమెంతో తెలియదు గానీ.. ఇప్పటికే వేలం వెర్రిగా జనాలు మాత్రం పుత్ర జీవక్ లను కొనుగోలు చేస్తున్నట్లు మాత్రం నిర్దారణ అవుతోంది. దీనికి నిదర్శనం.. రాజ్యసభను సైతం ఈ పుత్ర జీవక్ కుదిపపేయడమే. ఎంత దారుణం.. అమ్మ కడుపుకు వివక్షను ఆపాదించే మందులతో వ్యాపారం చేయాలన్న ఆలోచన ఎంత దుర్మార్గం..!
ఒకవిధంగా లింగ వివక్షను అనధికారంగా చట్టబద్దం చేసే చర్య ఇది. ఇప్పటికే.. అత్తింటి వేధింపులని, వారసత్వం నిలబడాలని.. అర్థం పర్థంలేని మూర్ఖత్వంతో ఆడపిల్లల ప్రసవాలకు సవాలక్ష అవాంతరాలు ఎదురవుతోన్న నేపథ్యంలో.. ఇలాంటి పుత్ర జీవక్ లను జనానికి ఆశ చూపడం సమాజాన్ని ఎటువైపు నడిపించడం కోసం?

నిర్దేశించే స్థానంలో ఉన్నవాడు.. తన వ్యాపార ధోరణి కోసం వివక్షను ప్రోత్సహించే చర్యలకు పాల్పడడం సరైందేనా..? లింగ నిర్దారణ జరిపించడం నేరమని చెప్పే ప్రభుత్వాలు.. ఇలాంటి చర్యల పట్ల మాత్రం ఎందుకు ఉదాసీనంగా వ్యవహరించాలి?. ప్రభుత్వాలు సమాజ ప్రయోజనాలు కాపాడాలంటే.. స్వార్ధపూరిత ప్రయోజనాల కోసం జనం మీదకు వదులుతోన్న ఇలాంటి పుత్రక్ జీవక్ లకు చెక్ పెట్టక తప్పదు.
రాజ్యసభను కుదిపేసిన పుత్ర జీవక్ :
రాందేవ్ ఫార్మసీ నుంచి ఉత్పత్తి అవుతోన్న పుత్రజీవక్ రాజ్యసభలోను చర్చకు వచ్చింది. దీని వాడకం వల్ల ఖచ్చితంగా మగపిల్లలే పుడుతారని జరుగుతోన్న ప్రచారంపై విచారణ జరిపించాలని ఉత్తరాఖండ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది కేంద్రం.
పుత్ర జీవక్ పై లిఖిత పూర్వక సమాధానాన్ని సమర్పించాల్సిందిగా కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి ఫగ్గస్ సింగ్ కులస్తే ఉత్తరాఖండ్ ను కోరారు. దీనిపై స్పందించిన ఉత్తరాఖండ్ ప్రభుత్వం.. గతేడాదే దీనిపై ముగ్గురు సభ్యులతో కూడిన విచారణ కమిటీని వేశామని, ప్రస్తుతం విచారణ కొనసాగుతోందని తెలిపింది.
పుత్రజీవక్ లాంటి మందులను ప్రవేశపెట్టడంపై జేడీయూ ఎంపీ కేసీ త్యాగి తీవ్రంగా మండిపడ్డారు. వెంటనే మందును నిషేధించి రాందేవ్ బాబాపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications