రాజకీయ మూల్యం చెల్లించేందుకు రెడీ, ఇలాగే ముందుకు: మోడీ సంచలనం
ఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ గురువారం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దేశ ప్రగతి కోసం కొత్త విధానాలు తీసుకు వస్తానని, అందుకు అవసరమైతే రాజకీయ మూల్యం చెల్లించుకోవడానికి కూడా తాను సిద్ధమని మోడీ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఢిల్లీలోను హిందూస్తాన్ టైమ్స్ లీడర్షిప్ సమ్మిట్లో ప్రధాని మోడీ మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రతిపక్షాల విమర్శలకు ధీటుగా సమాధానం చెప్పారు. భారత ప్రగతి కోసం ఇలాగే ముందుకు వెళ్తామని అభిప్రాయపడ్డారు.
రాజకీయ మూల్యానికి సిద్ధం
తమ ప్రభుత్వం అభివృద్ధికి కట్టుబడి పని చేస్తుందని మోడీ చెప్పారు. అవినీతి, నల్లధనరహిత సమాజాన్ని తయారు చేయడమే తమ లక్ష్యమని తేల్చి చెప్పారు. ఇందుకోసం తాను ఎంచుకున్న మార్గానికి రాజకీయ మూల్యం చెల్లించాల్సి వస్తే అందుకు కూడా సిద్ధమేనని చెప్పారు.
Recommended Video
ఆధార్ ఓ ఆయుధంలా పని చేస్తుంది
ఈ సందర్భంగా జీఎస్టీ, ఆధార్ అంశాలను ప్రధాని మోడీ ప్రస్తావించారు. బినామీ ఆస్తులను బయటకు తీసుకు వచ్చేందుకు ఆధార్ ఓ ఆయుధంలా పని చేస్తుందని తెలిపారు. అవినీతి నిర్మూలన, పారదర్శక వ్యవస్థకు జీఎస్టీతో ముందడుగు పడినట్లయిందన్నారు.
పెద్ద నోట్ల రద్దుతో ఫలం
పెద్దనోట్ల రద్దుతో సమాంతర ఆర్థిక వ్యవస్థగా ఉన్న నల్లధనం ఇప్పుడు అంతరించిపోయే స్థితికి చేరిందని మోడీ చెప్పారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో భారత దేశాన్ని 140వ స్థానం నుంచి వందకు తీసుకు వచ్చామని చెప్పారు. మార్పు ద్వారా ఇవి సాధ్యమన్నారు.
నాడు అలా, నేడు ఇలా
భగవద్గీత ఆత్మస్థైర్యాన్ని నింపుతుందని మోడీ చెప్పారు. రెండేళ్ల క్రితం ఇదే వేదికపై ప్రకాశవంతమైన భారత్ దిశగా అనే అంశంపై చర్చ జరిగిందని చెప్పారు. ఈ రోజు తిరుగులేని భారత్ అనే అంశంపై చర్చిస్తున్నామని చెప్పారు. ఇప్పుడు సానుకూల దృక్పథం దేశంలో ఎప్పుడు చూడలేదన్నారు.
మనకు ఎంతో చరిత్ర ఉంది
మన మీడియా నెగిటివ్గా ఎందుకు ఉందని, మన పైన మనకు సత్తా లేకుంటే ఎలా అని మోడీ ప్రశ్నించారు. మనకు ఎంతో ఉన్నతమైన చరిత్ర ఉందని, కానీ దానిని మనం పట్టించుకోవడం లేదన్నారు.