పోలీసులు మాకు శత్రువులు కాదు.. బంధీగా ఉన్న జవానును విడిచిపెట్టేందుకు సిద్దం.. కానీ..: మావోల లేఖ
మావోయిస్టులకు పోలీసులు శత్రువులు కాదని... ఎన్కౌంటర్లో చనిపోయినవారి కుటుంబాలకు సంతాపం తెలియజేస్తున్నామని మావోయిస్టు కమిటీ ప్రకటించింది. తమ వద్ద బంధీగా ఉన్న జవానును క్షేమంగా విడుదల చేసేందుకు సిద్దమని వెల్లడించింది. అయితే ఇందుకోసం కొన్ని షరతులు విధించింది. తమతో చర్చలకు మధ్యవర్తుల పేర్లను వెల్లడించాలని పేర్కొంది. ఈ మేరకు దండకారణ్య ప్రత్యేక జోనల్ కమిటీ పేరిట మావోయిస్టుల నుంచి ప్రకటన విడుదలైంది.

2వేల మందితో దాడి చేశారు : మావోయిస్టులు
కూంబింగ్ పేరుతో 2వేల మంది పోలీసులు తమపై దాడికి వచ్చినట్లు మావోయిస్టు కమిటీ ఆ లేఖలో ఆరోపించింది. కేంద్రమంత్రి అమిత్ షా నాయకత్వంలో 5 రాష్ట్రాల పోలీస్ అధికారులతో తమపై భారీ దాడులకు పథకం పన్నారని ఆరోపించింది. పోలీసుల దాడికి తాము ప్రతిదాడి చేశామని... ఈ క్రమంలో 23 మంది పోలీసులు చనిపోయారని తెలిపింది. మరో పోలీస్ తమ వద్ద బంధీగా ఉన్నట్లు వెల్లడించింది.అలాగే నలుగురు మావోయిస్టులు పోలీసుల దాడిలో మృతి చెందినట్లు పేర్కొంది.

బంధీగా ఉన్న జవానును విడిచిపెట్టేందుకు సిద్దం : మావోయిస్టులు
బంధీగా ఉన్న జవానును విడిచిపెట్టేందుకు తాము సిద్దమని మావోయిస్టు కమిటీ వెల్లడించింది. అయితే ఇందుకోసం తమతో చర్చలు జరిపే మధ్యవర్తుల పేర్లను వెల్లడించాలని చెప్పింది. ఆ పేర్లు ప్రకటించేంతవరకూ ఆ జవాను జనతన సర్కార్ వద్దే క్షేమంగా ఉంటారని తెలిపింది. మావోయిస్టులకు పోలీసులు ఎప్పుడూ శత్రువులు కాదని... పాలకవర్గం తెచ్చిన యుద్ధంలో పోలీసులు బలి పశువులు కావొద్దని విజ్ఞప్తి చేసింది. ఈ విషయాన్ని పోలీసులు,జవాన్లు కూడా గ్రహించాలని కోరింది. ప్రజలు,ప్రకృతి వనరులను కాపాడేందుకే తాము ప్రతి దాడి చేయాల్సి వస్తోందని తెలిపింది.

ప్రభుత్వానికే చిత్తశుద్ది లేదని ఆరోపణలు
ఛత్తీస్గఢ్ బీజాపూర్-సుక్మా అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్లో 14 ఆయుధాలు,2వేల తూటాలు,కొంత సామాగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు మావోయిస్టు కమిటీ పేర్కొంది. ఈ దాడిలో చనిపోయిన జవాన్ల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నట్లు తెలిపింది. చర్చలకు మావోయిస్టులు సిద్దంగానే ఉన్నారని... కానీ ప్రభుత్వానికే చిత్తశుద్ది లేదని ఆరోపించింది. మావోయిస్టులు రాసిన ఈ లేఖపై కేంద్రం ఇప్పుడెలా స్పందిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. మధ్యవర్తులను పంపించి బంధీగా ఉన్న జవానును విడిపిస్తారా లేక మరో వ్యూహం ఏదైనా అనుసరిస్తారా అన్నది చూడాలి.

బంధీగా ఉన్న రాకేశ్వర్...
ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్లో 24 మంది జవాన్లు అమరులు కాగా... 31 మంది జవాన్లు గాయపడ్డారు.మృతుల్లో ఏపీకి చెందిన మురళీ కృష్ణ, జగదీశ్ కూడా ఉన్నారు. వీరు కోబ్రా 210 దళంలో పనిచేస్తున్నారు. జమ్మూకశ్మీర్కు చెందిన సీఆర్పీఎఫ్ జవాను రాకేశ్వర్ మన్హాస్ ఇప్పటికీ మావోయిస్టుల చెరలోనే ఉన్నారు. రాకేశ్వర్ను సురక్షితంగా విడిచిపెట్టాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు. ఆయన కూతురు,చిన్నారి రాఘవి నక్సల్ అంకుల్ మా నాన్నను విడిచిపెట్టరా... అంటూ వీడియో విడుదల చేయడం చాలామందిని కంటతడి పెట్టించింది.












Click it and Unblock the Notifications