పెళ్లి కాకుండానే తల్లి!: కోర్టును ఆమె ఇలా కోరింది..
తాను పెళ్లి చేసుకోనందువల్ల అవివాహితగానే రికార్డుల్లోను పొందుపరిచాలని కోరింది.
ముంబై: పెళ్లి కాకుండానే బిడ్డకు జన్మనిచ్చిన ఓ తల్లి.. రికార్డుల్లో తనను వివాహితగా పేర్కొనవద్దని కోర్టును ఆశ్రయించింది. బిడ్డ తండ్రి పేరును రికార్డుల నుంచి తొలగించాల్సిందిగా కోర్టుకు విన్నవించింది. ముంబై కోర్టులో ఓ 22ఏళ్ల తల్లి చేసిన ఈ వాదన అక్కడివారిని ఆశ్చర్యపరిచింది.
వివరాల్లోకి వెళ్తే.. మహారాష్ట్రలోని ముంబై ప్రాంతంలో బోరివలి ప్రాంతానికి చెందిన 22ఏళ్ల యువతి పెళ్లి కాకుండానే గర్భం దాల్చింది. దీంతో 2014నవంబర్ నెలలో ఆమె ఓ చిన్నారికి జన్మనిచ్చింది. అయితే కూతురు పుట్టిన తర్వాత ఆమెను వివాహితగా పేర్కొంటూ.. తండ్రి పేరును కూడా రికార్డుల్లో నమోదు చేశారు.
తాజాగా ఆ వివరాలను తొలగించాలని కోరుతూ ఆమె కోర్టును బాంబే హైకోర్టును ఆశ్రయించింది. తాను పెళ్లి చేసుకోనందువల్ల అవివాహితగానే రికార్డుల్లోను పొందుపరిచాలని కోరింది. సింగిల్ పేరెంట్ గా తన వివరాలను నమోదు చేయాలని విన్నవించింది. దీనిపై బాంబే మున్సిపల్ కార్పోరేషన్ హెల్త్ ఆఫీసరుకు అఫిడవిట్ సమర్పించినా వారు తిరస్కరించారని సదరు మహిళ కోర్టులో వాపోయింది.
యువతి అభ్యర్థనపై స్పందించిన కోర్టు.. . దీనిపై సమగ్ర నివేదిక సమర్పించాలని, మహిళ మున్సిపాలిటీకి సమర్పించిన దరఖాస్తును తమకు ఇవ్వాలని ఆదేశించింది. ఈ మేరకు బాంబే హైకోర్టు చీఫ్ జస్టిస్ మంజులా చెల్లూర్, జస్టిస్ నితిన్ జందార్ ల బాంబే మున్సిపల్ కార్పొరేషన్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.