భార్య కోసం మిని తాజ్ మహల్ నిర్మిస్తున్నాడు
లక్నో: మొఘల్ చక్రవర్తి షాజహాన్ తన భార్య ముంతాజ్ జ్ఞాపకార్థం ఆగ్రాలో చారిత్రాత్మక తాజ్ మహల్ నిర్మించారు. ప్రపంచంలోని 7 వింతలలో తాజ్ మహల్ నిలిచిపోయింది. మొఘల్ చక్రవర్తి లాగ ఇప్పుడు రిటైడ్ పోస్టుమాస్టర్ ఒకాయన తన భార్య జ్ఞాపకార్థం మిని తాజ్ మహల్ నిర్మిస్తున్నారు.
తన ఆస్తులు అన్ని పోయినా పర్వాలేదని, మిని తాజ్ మహల్ నిర్మిస్తానని ప్రతిజ్ఞ చేశారు. ఉత్తరప్రదేశ్ లోని బులంద్ శహర్ లో పైజల్ హసన్ ఖ్రాది (80) అనే ఆయన నివాసం ఉంటున్నారు. ఈయన పోస్టుమాస్టర్ గా పని చేసి రిటైడ్ అయ్యారు. ఈయనకు 1953 లో వివాహం అయ్యింది.
58 ఏళ్ల వైవాహిక జీవితం తర్వాత ఆయన భార్య తాజాముల్లి బేగం క్యాన్సర్ వ్యాధితో భాదపడి 2011లో మరణించారు. దీంతో పవిత్రమైన తన భార్య ప్రేమకు గుర్తుగా మిని తాజ్ మహల్ నిర్మించాలని నిర్ణయించుకున్నారు.
భార్య సమాధి పక్కనే మిని తాజ్ మహల్ నిర్మిస్తున్నారు. భార్య సమాధి పక్కనే ఆయనకు సమాధి ఏర్పాటు చేసుకుంటున్నారు. ప్రస్తుతం వృద్దాప్యంలో ఉన్న ఆయన అంతులేని ప్రేమను గుర్తించిన అనేక మంది సహాయం చెయ్యడానికి ముందుకు వచ్చారు.
అయితే ఫైజల్ హసన్ వారి సహాయాన్ని సున్నితంగా తిరస్కరించారు. పొలం, భార్య నగలు విక్రయించి ఇప్పటి వరకు రూ. 11 లక్షలు ఖర్చు పెట్టి మిని తాజ్ మహల్ ను ఒక కోలిక్కి తీసుకు వచ్చారు. అయితే మార్బుల్స్ తదితర పనుల కోసం రూ. 7 లక్షలు అవసరం అయ్యింది.
విషయం తెలుసుకున్న ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ స్వయంగా స్పందించారు. ఆయనకు ఆర్థిక సహాయం చెయ్యాలని నిర్ణయించుకున్నారు. వెంటనే ఆర్థిక సహాయం చెయ్యాలని స్థానిక అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
అయితే ఫైజల్ హసన్ నిరాకరించారు. ఈ మిని తాజ్ మహల్ పూర్తి చేసి తన కళ్లారా చూడాలి, అదే నా చివరి కోరిక అంటున్నారు. తను చనిపోయిన తరువాత భార్య సమాధి పక్కనే అంత్యక్రియలు నిర్వహించాలని బ్యాంకులో డిపాజిట్ చేశానని, ఈ విషయం నా తమ్ముడికి చెప్పానని ఫైజల్ హసన్ అంటున్నారు.