కరోనా చికిత్స నుంచి మరో రెండు ఇంజెక్షన్లు ఔట్- కేంద్రం మార్గదర్శకాల్లో భారీ మార్పులు
కరోనా సోకిన వారికి భారత్లో ప్రస్తుతం అందిస్తున్న చికిత్సా విధానాల్లో పలు మార్పులు చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని డైరెక్టర్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ తాజా మార్గదర్శకాలు విడుదల చేసింది. వీటిలో కరోనా చికిత్స నుంచి ప్రస్తుతం వాడుతున్న రెండు ఇంజెక్షన్లను తొలగించింది. అంతే కాదు సాధారణ, లేక అసలు లక్షణాలే లేకుండా కరోనా సోకిన వారికి కేవలం రెండు మందుల్ని మాత్రమే సిఫార్సు చేసింది.
Recommended Video
కరోనా సాధారణ లక్షణాలు ఉన్నవారికి, లేదా అసలు లక్షణాలే లేని వారికి ప్రస్తుతం ఇస్తున్న మందుల్లో రెండింటిని మినహా మిగతా అన్నింటినీ తొలగిస్తున్నట్లు కేంద్రం తాజా మార్గదర్సకాల్లో పేర్కొంది. ఇందులో హైడ్రాక్సీ క్లోరోక్విన్, ఐవర్మెక్టిన్, డాక్సీసైక్లిన్, జింక్, మల్టీవిటమిన్ వంటి వాటిని కేంద్రం తొలగించింది. ఇకపై ఇలాంటి కరోనా సాధారణ లక్షణాలు లేదా అసలు లక్షణాలు లేని వారికి జ్వరం వస్తే యాంటీపైరెటిక్, జలుబు ఉంటే యాంటీ టస్సివ్ మాత్రమే ఇవ్వాలని సూచించింది.
కేంద్రం తాజా మార్గదర్శకాలతో ప్రస్తుతం స్వల్ప లక్షణాలు ఉన్న వారికి కూడా సీటీ స్కాన్లు, ఇతర మందులు సిఫార్సు చేస్తున్న డాక్టర్లకు చెక్ పడనుంది. కరోనా లక్షణాలేవీ లేని రోగులైతే ఇతర దీర్గకాలిక ఇబ్బందులేవీ లేకపోతే ఈ డ్రగ్స్ సరిపోతాయని కేంద్రం పేర్కొంది. స్వల్ప లక్షణాలు ఉన్న వారికి స్వీయ పర్యవేక్షణ సరిపోతుందని, ఏదైనా తేడా వస్తే తప్ప ఇతర చికిత్సలకు వెళ్లొద్దని కూడా కేంద్రం తాజా మార్గదర్శకాల్లో సూచించింది. ప్రస్తుతం భారత్లో కరోనా రోగులకు ఇస్తున్న ఐవర్మెక్టిన్ డ్రగ్ వల్ల ఎలాంటి ఉపయోగం లేదని ప్రపంచ ఆరోగ్య సంస్ధ ఇప్పటికే స్పష్టత ఇచ్చింది.