హర్యానా ‘నిర్భయ’ ఉదంతం: ముక్కలుగా నరికి... పేగులను పీకి...
హర్యానా ‘నిర్భయ’ ఉదంతంలో యువతి మృతదేహాన్ని ముక్కలుగా నరికి.. పేగుల్ని పీకేసి దుండగులు రాక్షసానందం పొందినట్టు పోస్ట్మార్టం నివేదిక తేల్చింది.
చండీగఢ్: హర్యానా 'నిర్భయ' ఉదంతంలో యువతి మృతదేహాన్ని ముక్కలుగా నరికి.. పేగుల్ని పీకేసి దుండగులు రాక్షసానందం పొందినట్టు పోస్ట్మార్టం నివేదిక తేల్చింది. హర్యానాలోని రోహ్తక్ ఘటనలో దళిత యువతిపై లైంగికదాడి అనంతరం ఆమె ముఖాన్ని గుర్తుపట్టకుండా రాళ్లతో కొట్టి చంపినట్టు వెల్లడైంది. ఈమేరకు ఆదివారం పోస్ట్మార్టం నివేదిక బయటకువచ్చింది.
తలకు బలమైన దెబ్బలు తగలడం వల్లే ఆమె మృతిచెందింది. ఆమె పుర్రె పలు చోట్ల పగిలిపోయింది. ఛాతీ సహా శరీరమంతా గాయాలమయమైంది. అన్నవాహిక సహా పేగులు తీసేశారు అని నివేదిక తెలిపింది.
సోనిపట్కు చెందిన ఆ యువతిని ఈ నెల 9న అపహరించిన దుండగులు.. సామూహికంగా అత్యాచారం చేసి, హతమార్చిన విషయం తెలిసిందే. ఈ ఘటనకు పాల్పడిన దోషులకు ఉరిశిక్ష విధించాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి.
జాతీయ మహిళా కమిషన్ అధ్యక్షురాలు లలితా కుమారమంగళం దీనిని సుమోటోగా స్వీకరించారు. ఇలాంటి కేసుల్లో సత్వర విచారణ అవసరమని అభిప్రాయపడ్డ కమిషన్ సభ్యురాలు రేఖాశర్మ, ఈ కేసును ఆద్యంతం జాతీయ మహిళా కమిషన్ పర్యవేక్షిస్తుందని తెలిపారు. ఈ దుర్ఘటన చూశాక ఏ తల్లీ ఆడపిల్లకు జన్మనివ్వవద్దని వేడుకుంటున్నానని హతురాలి తల్లి గద్గద స్వరంతో చెప్పారు