కరెన్సీ నోట్ల రద్దు ఇదే తొలిసారి కాదు, మోడీ రెండో ప్రధాని: ఆర్బీఐ మార్గదర్శకాలు
న్యూఢిల్లీ: ఆర్థిక వ్యవస్థను ప్రక్షాలణ చేసే దిశగా ప్రధాని నరేంద్ర మోడీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. నల్లధనాన్ని నిరోధించేందుకు చేపట్టిన చర్యల్లో భాగంగా రూ.500, రూ.1000 నోట్లను మంగళవారం నుంచి రద్దు చేయాలని నిర్ణయించినట్లు వెల్లడించారు.
నిజానికి దేశంలో ఇప్పటి వరకు చెలామణిలో ఉన్న కరెన్సీ నోట్లను రద్దు చేయడం ఇదే తొలిసారి కాదు. 1946 జనవరిలో తొలిసారి ఆర్బీఐ రూ.1000, రూ.10వేల నోట్లను రద్దు చేసింది.
ఆ తర్వాత 1954లో రూ.1000, రూ.ఐదువేలు, రూ.10వేల నోట్లను కొత్తగా ఆర్బీఐ ప్రవేశ పెట్టింది. 1978 జనవరిలో రూ.10వేలు, రూ.వెయ్యి నోట్లను నాటి ప్రభుత్వం రద్దు చేసింది. ఆ తర్వాత మళ్లీ చెలామణిలో ఉన్న కరెన్సీ నోట్లను రద్దు చేయడం ఇదే తొలిసారి.
అటల్ బిహారీ వాజపేయి హయాంలో రూ.1000 నోట్లు తిరిగి వచ్చాయి. నవంబర్ 2000లో ఈ నోట్లు తిరిగి వచ్చాయి. 1987లోనే రూ.500 నోట్లు చలామణిలోకి వచ్చాయి.
రూ.10 నోటు పైన అశోకా పిల్లర్ వాటర్ మార్క్ 1967 -1992 మధ్య వచ్చింది. రూ.20 నోటు పైన 1972 - 1975 మధ్య, రూ.50 నోట్ పైన 1975 - 1981 మధ్య, రూ.100 నోటు పైన 1967 - 79 మధ్య వచ్చింది.
1980 నుంచి కరెన్సీ నోట్ల పైన సత్యమేవ జయతే అని రాస్తున్నారు. ఇది జాతీయ చిహ్నం కింద ఉంటుంది. 1987లో మహాత్మా గాంధీ, అశోక పిల్లర్ వాటర్ మార్కుతో రూ.500 నోటును తెచ్చారు.
జాగ్రత్తగా ఉండాలి
రూ.500 రూ.1000 నోట్లను తీసుకునేవారు జాగ్రత్తగా ఉండాలని ఆర్బీఐ హెచ్చరించింది. ఈ నోట్లను తీసుకుంటే వారే బాధ్యత వహించాలని తెలిపింది.
2011 నుంచి 2016 వరకు రూ. 500 నోట్ల చలామణి 76 శాతం, రూ. 1000 నోట్లు 109 శాతం పెరగగా భారత ఆర్థిక వ్యవస్థ కేవలం 30 శాతం మాత్రమే పెరిగిందని ఆర్బీఐ పేర్కొంది. భారత ఆర్థికవ్యవస్థకు ప్రమాదకారిగా మారిన నల్లధనాన్ని నియంత్రించేందుకు తీసుకున్న చర్యల్లో ఇది ఒకటని ఆర్బీఐ ప్రకటించింది.
నోట్ల రద్దుపై ఆర్బీఐ మార్గదర్శకాలు
మధ్యకాలిక, దీర్ఘకాలిక దేశ ప్రయోజనాల కోసమే ఈ నిర్ణయమని ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ వెల్లడించారు. నోట్ల మార్పిడికి విధి విధానాలు రూపొందించినట్లు చెప్పారు. మన కరెన్సీపై ఉన్న రక్షణ పద్ధతిని చేరుకోలేనప్పటికీ నిజమైన నోట్లను పోలి ఉన్నాయని వెల్లడించారు.
ఆర్బీఐ విధివిధానాలు..
- ప్రస్తుతం 6.7 బిలియన్ల రూ.1000 నోట్లు చలామణిలో ఉన్నాయి.
- డెబిట్ కార్డులు, క్రెడిట్ కార్డులు, ఎలక్ట్రానిక్ లావాదేవీలు యథాతథం
- రూ.500, రూ.2వేల కొత్తనోట్లు జారీ చేస్తాం
- చెక్కులు, డీడీలు యథావిధిగా ఉంటాయి.
- ప్రజల కోసం కంట్రోల్ రూంలు ఏర్పాటు
- ఇతరుల సొమ్మును మీ ఖాతాలో డిపాజిట్ చేసే అవకాశం ఇవ్వొద్దు
- కొత్త నోట్లు నవంబరు 10న విడుదల చేస్తాం.
- కొత్త సిరీస్లో రూ.10, రూ.20, రూ.50, రూ.100 నోట్లు
- డిపాజిట్ల స్వీకరణకు బ్యాంకుల్లో అదనపు కౌంటర్లు












Click it and Unblock the Notifications