రూ. 500, 1000 నోట్లు నేటి నుంచే చెల్లవు: మోడీ
న్యూఢిల్లీ: ఈ రోజు అర్థరాత్రి నుంచి ఐదు వందలు, వేయి రూపాయల నోట్లు చట్టబద్ధం కావని ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించారు. కరెన్సీ నోట్లకు కేవలం కాగితాలు మాత్రమేనని, వాటికి ఏ మాత్రం విలువ ఉండదని అన్నారు.
ఐదు, వేయి రూపాయల నోట్లను ఈ ఏడాది డిసెంబర్ 31వ తేదీలోగా అంటే వచ్చే 50 రోజుల్లోగా బ్యాంకులో గానీ పోస్టాఫీసులో గానీ జనమ చేయాలని ఆయన సూచించారు. దానికి ఏ విధమైన చార్జీలూ ఉండవని చెప్పారు మంగళవారం జాతినుద్దేశించి ఆయన చేసిన ప్రసంగంలో ఆ విషయం చెప్పారు.
అవినీతి, నకిలీ కరెన్సీ, ఉగ్రవాదం ఆర్థిక వ్యవస్థను చేతుల్లోకి తీసుకుని ప్రమాదకరంగా పరణమిస్తున్నాయని ఆయన చెప్పారు. ఈ రోజు అర్థరాత్రి నుంచి 500, 1000 రూపాయల నోట్ల ముద్రణను ర్దదు చేస్తున్నట్లు తెలిపారు.
రోజూ బ్యాంకు నుంచి పది వేల రూపాయలకు మించి డ్రా చేయరాదని చెప్పారు.వారానికి 20 వేల రూపాయలకు మించి డ్రా చేయరాదని మోడీ చెప్పారు. డిసెంబరు చివరిలోగా డిపాజిట్ చేయనివారు ఆర్బీఐ నిబంధనల ప్రకారం డిపాజిట్ చేయవచ్చని తెలిపారు. రేపు బ్యాంకుల్లో వినియోగదారుల సేవలు రద్దు చేస్తున్నట్లు వెల్లడించారు. రేపు, ఎల్లుండి ఏటీఎంలు కూడా పనిచేయవని చెప్పారు. రూ.500, రూ. 2000 నోట్లను కొత్తగా తెస్తామని చెప్పారు.
నల్లధనం, అవినీతి కబంధ హస్తాల్లో దేశం చిక్కుకుపోయిందని, అధికార దుర్వినియోగంతో అనేకమంది భారీ సంపద కూడగట్టారని, నిజాయతీ పరులు అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడుతున్నారని, సాధారణ పౌరుడు అత్యంత నిజాయితీతో జీవిస్తున్నాడని ఆయన అన్నారు. అధికార వ్యవస్థ గురించి తెలిసినవాళ్లే అవినీతికి పాల్పడతున్నారు.
ఉగ్రవాద సంస్థలు రూ.500, రూ.1000 దొంగనోట్లను చెలామణి చేస్తూ దేశ ఆర్థిక వ్యవస్థను బలహీనపరుస్తున్నాయని, అవినీతిపరుల ఆటకట్టించేందుకు బినామీ ఆస్తుల చట్టాన్ని తీసుకొచ్చామని, సబ్ కా సాథ్- సబ్ కా వికాస్ అన్నదే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ప్రధాని స్పష్టం చేశారు.ఈ నెల 11 అర్థరాత్రి వరకు వైద్యసేవలు, రైలు టికెట్ల కోసం రూ.500, రూ. 1000 నోట్లు వినియోగించవచ్చు. నగదు తప్ప మిగతా లావాదేవీలు యథాతథంగా సాగుతాయని తెలిపారు.
"రేపు బ్యాంకుల్లో వినియోగదారుల సేవలు రద్దు చేశాం. రేపు, ఎల్లుండి ఏటీఎంలు పనిచేయవు. ఈ కార్యక్రమానికి మీరెంత సహకరిస్తే..అంత ప్రయోజనం లభిస్తుంది. మొత్తం వ్యవహారం చక్కబెట్టేందుకు ఆర్బీఐ, బ్యాంకులపై తీవ్రమైన ఒత్తిడి ఉంటుంది. దీపావళి మరునాడు వీధుల్లో చెత్త ఊడ్చినట్లు, దేశంలో అనినీతిని ఊడ్చేద్దాం. నల్లధనం, దొంగనోట్లతో ఆటలాడేవారి ఆట కట్టిద్దామ"ని ప్రధాని అన్నారు.
"ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత్ ఒక వెలుగు రేఖని ఐఎంఎఫ్ చెప్పింది. బడుగుబలహీన వర్గాల కోసం ప్రత్యేక కార్యక్రమాలు అమలు చేస్తున్నాం. పేదల అభివృద్ధి కోసం ప్రభుత్వం పనిచేస్తుంది. భారత్ వేగంగా ఆర్థికాభివృద్ధి సాధిస్తోంది. భారత్లో అవినీతి చాలా వరకు తగ్గింది" అని అన్నారు.
రెండున్నరేళ్లలో లక్షా 25వేల కోట్ల నల్లధనాన్ని వెలికి తీశామని ప్రధాని చెప్పారు. అవినీతి, నల్లధనం, ఉగ్రవాదంపై రాజీలేని పోరాటం చేయాలని ప్రధాని పిలుపునిచ్చారు.