సైన్యంపై భగవత్ వ్యాఖ్యలు సిగ్గుచేటు: రాహుల్.. ప్రైవేట్ సైన్యానికి ప్రధాని అనుకూలమా?
Recommended Video

న్యూఢిల్లీ: దేశ భద్రత కోసం ప్రాణ త్యాగాలు చేస్తున్న సైన్యాన్ని ఉద్దేశించి ఆరెస్సెస్ అధినేత మోహన్ భగవత్ చేసిన వ్యాఖ్యలపై విపక్షం మండిపడింది. దీనిపై ఆయన క్షమాపణ చెప్పాల్సిందేనని డిమాండ్ చేసింది. సరిహద్దులకు ప్రైవేట్ సైన్యాన్ని పంపేందుకు అనుకూలమా? అన్న సంగతి ప్రధాని నరేంద్రమోదీ చెప్పాలని స్పష్టం చేసింది.
సైన్యం మోహన్ భగవత్ వ్యాఖ్యలు సిగ్గుచేటని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు. దీనిపై మోహన్ భగవత్ క్షమాపణ చెప్పాల్సిందేనని స్పష్టం చేశారు. సోమవారం కర్ణాటకలోని జెవార్గిలో రాహుల్ మీడియాతో మాట్లాడుతూ భగవత్ పొరపాటు చేశారని, అందుకు క్షమాపణ చెప్పక తప్పదన్నారు.
'సరిహద్దుల్లో మన సైనిక జవాన్లు రక్తం ధారపోస్తున్నారు. సైన్యం గురించి మోహన్ భగవత్ వ్యాఖ్యలు వినడానికే బాధగా ఉంది' అని ఆందోళన వ్యక్తం చేశారు.

జాతీయ పతాకాన్ని అవమానించిన భగవత్
‘సైనికులు దేశ భద్రత కోసం పని చేస్తున్నారు. ప్రాణ త్యాగం చేస్తున్న సైనికులపై భగవత్ వ్యాఖ్యలు వారిని అవమానించడమే. ఇది ప్రతి భారతీయుడికి అవమానకరమే. ప్రతి సైనికుడు జాతీయ పతాకానికి గౌరవ వందనం సమర్పిస్తారు. భగవత్ వ్యాఖ్యలు మన జాతీయ పతాకాన్ని అవమానించడమే' అని అన్నారు. ‘పారా మిలిటరీ బలగాల్లో పని చేస్తున్నా, సైన్యంలో పని చేస్తున్నా, నావికాదళంలో పని చేస్తున్నా, వైమానిక దళంలో పని చేస్తున్నా వారు సైనికులే. వారికి వ్యతిరేకంగా భగవత్ మాట్లాడారు. ఆయన ఏం మాట్లాడినా సైన్యానికి వ్యతిరేకంగా ఉన్నది' అని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు.

ఆరెస్సెస్ క్షమాపణ చెప్పాల్సిందేనన్న రాహుల్
ఆర్మీని ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్ అవమానిస్తున్నారని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆరోపించారు. దేశం కోసం ప్రాణాలర్పిస్తున్న సైన్యం పట్ల భగవత్ ప్రసంగం ప్రతి భారతీయుడికి అవమానకరం అని స్పష్టం చేశారు. ప్రాణ త్యాగం చేసిన అమర వీరులను అవమానించడం మోహన్ భగవత్కే సిగ్గుచేటు. ఆరెస్సెస్ క్షమాపణ చెప్పాల్సిందే' అని ట్వీట్ చేశారు.

యుద్ధానికి సిద్ధం కావాలంటే ఆరెస్సెస్కు మూడు రోజులు చాలు
బీహార్లోని ముజఫర్పూర్లో ఆరెస్సెస్ కార్యకర్తల సమావేశంలో ఆదివారం మోహన్ భగవత్ మాట్లాడుతూ ‘యుద్ధానికి సంసిద్ధం కావడానికి సైన్యానికి ఆరేడు నెలల సమయం పడుతుంది. కానీ మనకు (ఆరెస్సెస్ శ్రేణులకు) రెండు, మూడు రోజులు చాలు. ఇది మన సామర్థ్యం. ఇది మన క్రమశిక్షణ' అని అన్నారు. ‘మన సంస్థ మిలిటరీ సంస్థ, పారా మిలిటరీ సంస్థ కాదు.. కానీ మనకు గల క్రమశిక్షణ అలా తయారు చేస్తున్నది' అని భగవత్ వ్యాఖ్యానించారు.

మనలో అనైక్యత ఉంటే ఇతరులు పాలిస్తారన్న బూచీ
1962లో సరిహద్దుల్లో చైనా సైన్యం దురాక్రమణకు పాల్పడినప్పుడు.. మన సైన్యం సరిహద్దులకు చేరుకునే వరకు ఆరెస్సెస్ వలంటీర్లే శత్రు సైన్యాన్ని నిలువరించారని చెప్పారు. ‘మనం దేశం కోసం ప్రాణాలర్పించేందుకు సిద్ధం. ఒకవేళ మనలో అనైక్యత వస్తే దేశానికే ముప్పు. మనలో అనైక్యత ఉంటే ఇతరులు మనను పాలిస్తారు' అని వ్యాఖ్యానించారు. రాజ్యాంగం అనుమతినిస్తే దేశం కోసం ఎటువంటి విపత్కర పరిస్థితుల (యుద్ధాన్నైనా) నైనా ఎదుర్కొనేందుకు స్వయంసేవకులు సిద్ధం అని మోహన్ భగవత్ తేల్చి చెప్పారు.

సామాన్యులు, సంఘ్ మధ్యే భగవత్ పోలిక అని దాటవేత
భగవత్ వ్యాఖ్యలు వివాదాస్పదం కావడంతో ఆరెస్సెస్ నష్ట నివారణ చర్యలు చేపట్టింది. భగవత్ వ్యాఖ్యలను వక్రీకరించారని ఆరెస్సెస్ సీనియర్ నేత మన్మోహన్ వైద్య స్పష్టం చేశారు. భారత ఆర్మీతో సంఘ్ వలంటీర్లను సరిపోల్చనే లేదని ఒక ప్రకటనలో వివరణ ఇచ్చారు. భగవత్ వ్యాఖ్యలు కేవలం సామాన్యులు, సంఘ్ వలంటీర్ల మధ్య పోలికలు తేవడానికేనని పేర్కొన్నారు.

భగవత్ వ్యాఖ్యలు తెలుసుకున్నాకే స్పందిస్తానన్న అమిత్ షా
ఎటువంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు స్వయంసేవకుల సంసిద్ధతను తెలియజేసేందుకే ఆరెస్సెస్ అధినేత మోహన్ భగవత్ ఆ వ్యాఖ్యలు చేసి ఉంటారని బీజేపీ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ పేర్కొన్నారు. సైన్యం శౌర్యం, త్యాగాల పట్ల ఆరెస్సెస్ ఎంతో గౌరవం ఉన్నదన్నారు. అయితే ఆయన (మోహన్ భగవత్) ఏం మాట్లాడారో తెలియదని, ఆరెస్సెస్ వలంటీర్లు దైనికైనా సంసిద్ధంగా ఉంటారని చెప్పేందుకే ఆ వ్యాఖ్యలు చేసి ఉంటారన్నారు. దేశ భద్రత కోసం విధులు నిర్వర్తిస్తున్న ఆర్మీ పక్షాన ఎల్లవేళలా ఆరెస్సెస్ వలంటీర్లు నిలిచి ఉంటారని వ్యాఖ్యానించారు. ఇక బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా తాను సోషల్ మీడియా ద్వారానే ‘మోహన్ భగవత్' వ్యాఖ్యల గురించి విన్నానని వ్యాఖ్యానించారు. మోహన్ భగవత్ ఏం మాట్లాడారో తెలుసుకున్న తర్వాతే తాను ప్రతిస్పందిస్తానని చెప్పారు.

ఆరెస్సెస్ క్షమాపణ చెప్పాలన్న ఎన్సీపీ
మోహన్ భగవత్ వ్యాఖ్యలపై ఆరెస్సెస్ క్షమాపణ చెప్పాలని శరద్ పవార్ సారథ్యంలోని నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) డిమాండ్ చేసింది. భగవత్ వ్యాఖ్యలు ఆర్మీకి అవమానకరమని ఎన్సీపీ అధికార ప్రతినిధి నవాబ్ మాలిక్ పేర్కొన్నారు. ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్ను వెనుకేసుకొచ్చిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిరెన్ రిజిజును త్రుణమూల్ కాంగ్రెస్ తూర్పారబట్టింది. రిజిజు వ్యాఖ్యలతో కేంద్ర ప్రభుత్వం రిమోట్ సంఘ్ వద్ద ఉన్నదని అర్థమవుతున్నదని త్రుణమూల్ కాంగ్రెస్ నేత డెరిక్ ఓ బ్రెయిన్ వ్యాఖ్యానించారు. ‘కేంద్రంలోని మంత్రి ఆరెస్సెస్ కు మద్దతునిస్తున్నారు. సమర్థిస్తున్నారు. ఆయన కేంద్ర మంత్రి కాదు సంఘ్ మంత్రి' అని బ్రెయిన్ అన్నారు.

దేశ ఐక్యతను మంట గలిపేందుకు సంఘ్ ప్రైవేట్ సైన్యం
కేరళ సీఎం పినరయి విజయన్ స్పందిస్తూ మోహన్ భగవత్ వ్యాఖ్యలను తప్పుబట్టారు. ఆరెస్సెస్ దేశాన్ని ముస్సోలిని సారథ్యంలోని ఇటలీ మాదిరిగా, హిట్లర్ హయాంలోని జర్మనీగా మాదిరిగా మార్చేయాలని కోరుకుంటున్నదని మండిపడ్డారు. ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్ వ్యాఖ్యలతో భారత ప్రభుత్వ సంస్థల పట్ల సంఘ్కు ఎటువంటి గౌరవం లేదని తేలిపోయిందన్నారు. ఆరెస్సెస్ ముందు రహస్య ఎజెండా ఉన్నదని ఆరోపించారు. దేశ ఐక్యతను మంట గలిపేందుకు వ్యక్తిగత ప్రైవేట్ సైన్యాన్ని రూపొందించాలని సంఘ్ భావిస్తున్నదని తన ఫేస్ బుక్ ఖాతాలో పినరయి విజయన్ పోస్ట్ చేశారు. సైన్యాన్ని అవమానిస్తూ భగవత్ చేసిన వ్యాఖ్యలపై ప్రధాని మోదీ కేంద్ర ప్రభుత్వ వైఖరి స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. .












Click it and Unblock the Notifications