యడ్యూరప్పను నిర్లక్ష్యం చేయొద్దు: బీజేపీకి ఆర్ఎస్ఎస్ రిపోర్ట్, ఎందుకంటే..?
బెంగళూరు: వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అప్పుడే కర్ణాటకలో రాజకీయ వేడి రాజుకుంటోంది. రెండోసారి అధికారంలోకి రావడమే లక్ష్యంగా ఇప్పటికే భారతీయ జనతా పార్టీ ప్రచారం ప్రారంభించగా.. అధికారాన్ని నిలుపుకునేందుకు కాంగ్రెస్ కూడా త్వరలో తమ ప్రచారంతో హోరెత్తించేందుకు సిద్ధమవుతోంది.
హనుమంతుడొస్తున్నాడు..: సిద్ధరామయ్యపై తేల్చేసిన యోగి
ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని పరిస్థితులపై రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్).. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాకు ఓ నివేదికను పంపింది. 2018లో జరిగే ఎన్నికల్లో గెలువాలంటే ఏం చర్యలు తీసుకోవాలి, ఏ పనులు చేయకూడదనే దానిపై ఇందులో వివరించింది.
విభేదాలు సృష్టిస్తున్న కాంగ్రెస్?
కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర బీజేపీ నేతల్లో విభేదాలను సృష్టిస్తోందని, ఇది పార్టీకి నష్టం చేసేదిగా ఉందని నివేదికలో ఆర్ఎస్ఎస్ పేర్కొంది. బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ అవాస్తవ ఆరోపణలు కూడా చేస్తోందని తెలిపింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర బీజేపీకి నాయకత్వం వహించేది ఎవరనే అంశం చర్చనీయాంశంగా మారింది.
యడ్యూరప్పే సీఎం అభ్యర్థి
కర్ణాటక బీజేపీ అధ్యక్షుడిగా బీఎస్ యడ్యూరప్ప కొనసాగుతున్నారు. బీజేపీలోని బలమైన మరో నేత ఈశ్వరప్ప లెజిస్లేటివ్ కౌన్సిల్లో ప్రతిపక్ష నేతగా కొనసాగుతున్నారు. ఇంతకుముందు యడ్యూరప్ప ముఖ్యమంత్రి చేసిన నేపథ్యంలో ఆయననే సీఎం అభ్యర్థిగా ప్రకటించే అవకాశాలున్నాయి.
తెరపైకి మరో నేత
అయితే, ఇప్పుడు ఉత్తరకన్నడ ఎంపీ అనంత్ కుమార్ హెగ్డే కూడా బీజేపీ సీఎం అభ్యర్థి రేసులో ఉన్నారంటూ స్థానికంగా కొన్ని మీడియాల్లో వార్తలు రావడం గమనార్హం. బ్రాహ్మణ వర్గానికి చెందిన హెగ్డేకు కోస్టల్ బెల్టులో మాస్ ఫాలోయింగ్ ఉంది. తన ప్రాంతంలో బీజేపీ గెలుపులో ఆయన ప్రభావం బలంగానే ఉంటుంది.
యడ్యూరప్ప కీలకమే..
అయితే, కీలకంగా ఉన్న యడ్యూరప్ప ప్రాధాన్యతను బీజేపీ తగ్గించడానికి కూడా లేదు. ఎందుకంటే.. యడ్యూరప్ప వర్గమైన లింగాయత్ ఓటు షేర్ 17.8శాతం ఉండటం గమనార్హం. బ్రాహ్మణుల ఓటు శాతం 1.2మాత్రమే ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ రెండు వర్గాల మధ్య విభేదాలు సృష్టించి.. కాంగ్రెస్ లాభం పొందే ప్రయత్నాలు చేస్తోందని బీజేపీ అనుమానిస్తోంది.
యడ్యూరప్ప పక్కన పెట్టొద్దు
ఒకవేళ యడ్యూరప్పను సీఎం అభ్యర్థి నుంచి బీజేపీ పక్కన పెట్టినట్లయితే ఆ వర్గ ఓటర్లలో కొంత శాతం ఆ పార్టీకి వ్యతిరేకంగా మారే అవకాశం లేకపోలేదని భావిస్తోంది. అందుకే బీజేపీ యడ్యూరప్పను పరిగణలోకి తీసుకోవాల్సిందేనని ఆర్ఎస్ఎస్ తన నివేదికలో స్పష్టం చేసినట్లు తెలిసింది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో యడ్యూరప్పే బీజేపీ గెలుపులో కీలక పాత్ర పోషిస్తారని పేర్కొంది.