అవిశ్వాసం: ఇవాళ సబ్బంహరి వంతు, సుష్మాపై పొన్నం
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా సీమాంధ్ర కాంగ్రెసు పార్టీ పార్లమెంటు సభ్యులు సబ్బం హరి, సీమాంధ్ర తెలుగుదేశం పార్టీ ఎంపి మోదుగుల వేణుగోపాల్ రెడ్డిలు అవిశ్వాస తీర్మానం నోటీసును ఇచ్చారు. వారు గురువారం ఉదయం సభాపతి మీరా కుమార్కు నోటీసును ఇచ్చారు.
కేంద్ర ప్రభుత్వంపై సీమాంధ్ర కాంగ్రెస్ ఎంపీలు వ్యూహాత్మకంగా అవిశ్వాస తీర్మానం నోటీసులు ఇస్తున్నారు. బుధవారం పార్లమెంటు ప్రారంభం తొలిరోజు ఉండవల్లి అరుణ్ కుమార్ నోటీసు ఇవ్వగా ఈ రోజు సబ్బం ఇచ్చారు. ప్రతిరోజు ఒక సభ్యుడు అవిశ్వాస నోటీసు ఇవ్వాలని సీమాంధ్ర కాంగ్రెస్ ఎంపీలు నిర్ణయించుకున్న విషయం తెలిసిందే. మరోవైపు గురువారం ఉదయం ఉభయ సభలు ప్రారంభం కాగానే సీమాంధ్ర ఎంపీలు ప్లకార్డులు ప్రదర్శించి సమైక్యాంధ్ర నినాదాలు చేయడంతో గందరగోళం ఏర్పడింది. దీంతో ఉభయ సభలను గంటపాటు వాయిదా వేశారు.
ఒప్పుకోం: పొన్నం
తాము హైదరాబాదును కేంద్రపాలిత ప్రాంతంగా ఒప్పుకునే పరిస్థితే లేదని కరీంనగర్ పార్లమెంటు సభ్యులు, తెలంగాణ ప్రాంత సీనియర్ నేత పొన్నం ప్రభాకర్ అన్నారు. తెలంగాణకు ఇబ్బంది లేని సీమాంధ్ర కేంద్రమంత్రుల సవరణలను తాము అంగీకరిస్తామని చెప్పారు. కానీ హైదరాబాదును యూటి అంటే మాత్రం ఒప్పుకునేది లేదన్నారు.
సార్వత్రిక ఎన్నికలలోగానే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఖాయమని అన్నారు. దానిని ఎవరు అడ్డుకోలేరని, తమ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ నిర్ణయం తీసుకున్నారన్నారు. తొమ్మిది ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీని దోషిగా చేశారని, ఇప్పుడు తెలంగాణను కాంగ్రెస్ పార్టీయే ఏర్పాటు చేస్తోందన్నారు. ఈ సమావేశాల్లో బిల్లు పాసవుతుందని ధీమా వ్యక్తం చేశారు.
సమైక్యమంటూ డిల్లీలో మౌన దీక్ష చేసిన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చరిత్రహీనుడిగా మిగిలిపోక తప్పదన్నారు. ప్రధాన ప్రతిపక్షం భారతీయ జనతా పార్టీతో పాటు తమ పార్టీ విభజనకు అనుకూలంగా ఉన్నాయన్నారు. తెలంగాణపై సోనియా, సుష్మా స్వరాజ్ వెనక్కి తగ్గరన్నారు.