రాజస్తాన్ అస్థిరత్వం కంటిన్యూ..? ఇవాళ మరోసారి సీఎల్పీ, నిన్న 18 మంది డుమ్మా, ఇద్దరు మంత్రులు కూడా..
రాజస్తాన్లో అస్థిరత్వం కొనసాగుతూనే ఉంది. డిప్యూటీ సీఎం సచిన్ పైలట్ను బుజ్జగించేందుకు కాంగ్రెస్ విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. కానీ పైలట్ మాత్రం చర్చలకు నో అంటున్నారు. నిన్న (సోమవారం) తమతో 107 మంది సభ్యులు ఉన్నారని అశోక్ గెహ్లట్ ప్రకటించగా.. కాదు అని తన వద్ద 25 మంది సిట్టింగ్ సభ్యులు ఉన్నారని పైలట్ చెప్పారు. ఉదయం 30 మంది అన్న పైలట్ తర్వాత 25 మంది అని వెల్లడించారు. కానీ తర్వాత ఆ సంఖ్య 15 నుంచి 18 వరకు చేరింది. తనతో ఉన్న ఎమ్మెల్యేల ఫోటోను సచిన్ పైలట్ కార్యాలయం ఫోస్ట్ చేసింది. దీంతో గెహ్లట్కు మద్దతిచ్చేది ఎవరు..? పైలట్ వెంట నిలిచేదేవరు...?
రాజస్థాన్ సంక్షోభం: గెహ్లాట్ వద్ద ఉన్నది 84 ఎమ్మెల్యేలేనా? సచిన్ సవాల్, పెరుగుతున్న మద్దతు
15 నుంచి 18 మంది.
అశోక్ గెహ్లట్తో పొసగకపోవడంతో తిరుగుబాటు ఎగరేసిన సచిన్ పైలట్ తన వర్గం ఎమ్మెల్యేలతో హస్తినలో మకాం వేశారు. కాంగ్రెస్ హై కమాండ్కు తన దెబ్బ ఏంటో చూపించాలని అనుకొంటున్నారు. అయితే తన వర్గం ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించాలని భావిస్తున్నారు. ఈ మేరకు వారితో చర్చించగా.. కొందరు విముఖత వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. దీంతో పైలట్ హై కమాండ్పై మరింత ఒత్తిడి తీసుకురావడం కాస్త కష్టంగా మారుతోంది. దీనిని గమనించిన కాంగ్రెస్ హై కమాండ్ ఎమ్మెల్యేలపై ప్రెషర్ చేస్తోంది. మంగళవారం జరిగే సీఎల్పీ సమావేశానికి రావాలని కోరుతోంది. లేదంటే క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తోంది. వారికి మంగళవారం వరకు గడువు ఇవ్వడంతో కొందరు ఎమ్మెల్యేలు కాస్త జంకినట్టు తెలుస్తోంది. అయితే పైలట్ వద్ద 15 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని కాంగ్రెస్ అధిష్టానం అంచనా వేస్తోంది.
ఇద్దరు మంత్రులు డుమ్మా...
సోమవారం గెహ్లట్ నివాసంలో సీఎల్పీ సమావేశం జరిగిన వెంటనే ఎమ్మెల్యేలను క్యాంపునకు తీసుకెళ్లారు. ఇవాళ అక్కడ రెండోరోజు సీఎల్పీ సమావేశం నిర్వహిస్తున్నారు. ఉదయం 10 గంటలకు సమావేశం ప్రారంభమవుతుంది. అయితే నిన్న 18 మంది ఎమ్మెల్యేలు గైర్హాజరు అయ్యారు. ఇందులో ఇద్దరు మంత్రులు విశ్వేంద్ర సింగ్, రమేశ్ చంద్ మీనా ఉన్నారు. మరో మంత్రి భన్వర్లాల్ మేఘ్వాల్ కూడా హాజరుకాలేదు. కానీ ఆయన అనారోగ్యం వల్ల రాలేదని పార్టీ వర్గాలు తెలిపాయి. మేఘ్వాల్కు ఇటీవల పక్షపాతం వచ్చిన సంగతి తెలిసిందే.
నిన్న 18 మంది.. ఇవాళ...
మంత్రులు విశ్వేంద్ర సింగ్, రమేశ్ చంద్ మీనా, ఎమ్మెల్యేలు హరీశ్ మీనా, దీపేంద్ర సింగ్ షెకావత్, హెమరాం చౌదరి, బ్రిజేంద్ర సింగ్ ఓలా, గజ్రాజ్, రాకేష్ పరేఖ్, పృథ్వీరాజ్ మీనా, భన్వర్ లాల్ శర్మ, మురళీలాల్ మీనా, రామ్ నివాస్ గౌరియా, సురేశ్ మోడీ, ఇంద్రజీత్ సింగ్, అమర్ సింగ్, గజేంద్ర సింగ్ షెకావత్, వేద్ ప్రకాశ్ సోలంకి, లోకేంద్ర సింగ్ సీఎల్పీ భేటీకి హాజరుకాలేదు.
మరో ఎంపీ కాకుడదని...
మధ్యప్రదేశ్లో అధికారం కోల్పోయినందున మరో రాష్ట్రాన్ని కోల్పోయేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా లేదు. అందుకోసమే ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు విశ్వప్రయత్నాలు చేస్తోంది. సచిన్ పైలట్ను కూడా దారిలోకి తెచ్చుకునేందుకు తన వంతు ప్రయత్నాలు చేపట్టింది. సోమవారమే సోనియా, ప్రియాంక, రాహుల్ మాట్లాడినట్టు తెలుస్తోంది. అయితే రాహుల్ గాంధీతో భేటీకి సచిన్ పైలట్ మాత్రం సుముఖంగా లేరు. అయితే ఇవాళ్టి భేటీకి ఎంతమంది ఎమ్మెల్యేలు హాజరవుతారనే ఉత్కంఠ నెలకొంది. గైర్హాజరయిన ఎమ్మెల్యేలపై పార్టీ ఏ విధంగా చర్యలు తీసుకుంటుందో చూడాలి మరీ.
Recommended Video
తటస్థంగా బీటీపీ
ఇదిలా ఉంటే భారతీయ ట్రైబర్ పార్టీ మాత్రం గెహ్లట్, పైలట్తో సమానదూరం పాటిస్తోంది. తమ ఇద్దరు ఎమ్మెల్యేలు ఒక్కొక్కరికీ మద్దతిచ్చే ఛాన్స్ ఉంది. లేదంటే ఇద్దరికీ సమానదూరంగా ఉండి.. ఇద్దరి నుంచి తప్పించుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ బీటీపీ మాత్రం గెహ్లట్కు మద్దతు ఇవ్వాలని విస్పష్టంగా చెప్పినట్టు విశ్వసనీయంగా తెలసింది.