బాంబు పేల్చిన చిన్నమ్మ- అసలు గేమ్ స్టార్ట్
త్వరలో అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొనబోతోంది తమిళనాడు. ఈ నేపథ్యంలో ఇప్పటి నుంచే రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఈసారి ఎన్నికల బరిలో తమిళగ వెట్రి కజగం (TVK) అధినేత విజయ్ అడుగుపెడుతున్నందున అందరి దృష్టి ఆయనపైనే ఉంది. విజయ్ రాకతో త్రిముఖ పోటీ నెలకొంది. అధికారాన్ని నిలబెట్టుకోవడానికి డీఎంకే.. ఈ పార్టీని గద్దె దింపడానికి ఏఐఏడీఎంకే ఇప్పటికే హోరాహోరి పోరు సాగిస్తోన్నాయి.
ఈ పరిణామాల మధ్య ఏఐఏడీఎంకే బహిష్కృత నాయకురాలు వీకే శశికళ తెర మీదికి వచ్చారు. దివంగత ముఖ్యమంత్రి జయలలిత జయంతి వేడుకలకు ముందు కీలక రాజకీయ ప్రకటన చేయనున్నట్లు సూచించారు. నేడు ఓ గుడ్ న్యూస్ ప్రకటించబోతోన్నట్లు వెల్లడించారు. అమ్మ జయలలిత పుట్టినరోజు సందర్భంగా ఓ బహిరంగ సభను నిర్వహించబోతోన్నానని, ఈ కార్యక్రమంలోనే ఆ శుభవార్త వెలువడుతుందని శశికళ పేర్కొన్నారు.

ఏఐఏడీఎంకే నుంచి బహిష్కరణ తర్వాత శశికళ రాజకీయ భవిష్యత్తు, కొత్త రాజకీయ పార్టీని ప్రారంభించే అవకాశాలపై ఊహాగానాలు కొనసాగుతున్నాయి. ఈ వ్యాఖ్యలకు ముందు, ఆమె పార్టీ వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి ఎంజీ రామచంద్రన్ తో పాటు జయలలిత చిత్రపటాలకు నివాళి అర్పించారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల సన్నాహంగా చెన్నైలో తన మద్దతుదారులతో ఆమె సమావేశం అయ్యారు. ఈ ఉదయం మధురైలో మీనాక్షి అమ్మవారిని దర్శించుకున్నారు.
ఒకప్పుడు ఏఐఏడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా, జయలలితకు అత్యంత సన్నిహితురాలిగా ఒక వెలుగు వెలిగారు శశికళ. జయలలిత మరణం తర్వాత ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికీ ఏర్పాట్లు చేసుకున్నారు. ఆ దశలో ఆస్తుల కేసులో దోషిగా తేలడంతో పార్టీ నుంచి బహిష్కరానికి గురయ్యారు. బెంగళూరులోని పరప్పన అగ్రహార కేంద్ర కారాగారంలో జైలుశిక్షను అనుభవించారు. త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలను పురస్కరించుకుని క్రియాశీలక రాజకీయాల్లో తిరిగి ప్రవేశించాలని నిర్ణయించారు.
దీనికి అనుగుణంగా అడుగులు వేస్తోన్నారు. జయలలిత అభిమానులు, ఏఐఏడీఎంకే- బీజేపీ పొత్తు పొసగని నాయకులు, ఎడప్పాడి పళణిస్వామి వ్యతిరేక వర్గాన్ని కూడగట్టుకునే ప్రయత్నం చేస్తోన్నారు. చెన్నైలో నిర్వహించిన సమావేశానికి పలువురు నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు. చిన్నమ్మ ఏ నిర్ణయం తీసుకున్నా ఆమెకు అండగా నిలబడతామని శశికళ మద్దతుదారుడు అరసన్ తెలిపారు. 2026 ఎన్నికలలో ఆమె ఎలాంటి నిర్ణయం తీసుకున్నా ఆమె వెంటే ఉంటామని స్పష్టం చేశారు.
మొత్తం 234 స్థానాలున్న తమిళనాడు అసెంబ్లీకి త్వరలో ఎన్నికలు జరగనున్నాయి. అధికార ఎంకే స్టాలిన్ నేతృత్వంలోని కూటమి 'ద్రవిడన్ మోడల్ 2.0' నినాదంతో బీజేపీ-ఏఐఏడీఎంకే కూటమిని ఎదుర్కొనేందుకు సన్నద్ధమవుతోంది. నటుడు-రాజకీయ నాయకుడు విజయ్ తమిళగ వెట్రి కజగం (టీవీకే) పార్టీతో త్రిముఖ పోటీకి తెరలేపనున్నారు. 2021 ఎన్నికలలో డీఎంకే 133 స్థానాలు గెలుచుకుంది. మిత్రపక్షాలైన కాంగ్రెస్ 18, పీఎంకే 5, వీసీకే 4, ఇతర పార్టీలు 8 స్థానాలను కైవసం చేసుకున్నాయి. ఎన్డీఏకు 75 స్థానాలు లభించాయి. ఏఐఏడీఎంకే 66 సీట్లతో అందులో అతిపెద్ద పార్టీగా నిలిచింది.












Click it and Unblock the Notifications