నటరాజన్కు గుండెపోటు.. మళ్లీ పెరోల్ కోసం శశికళ దరఖాస్తు!
చెన్నై: అన్నాడీఎం నేత వీకే శశికళ భర్త నటరాజన్ (74) మరోసారి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆయనకు గుండెపోటు రావడంతో చెన్నైలోని గ్లోబల్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం నటరాజన్ పరిస్థితి విషమంగా ఉండటంతో ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు.
దీనిపై ఆసుపత్రి వర్గాలు ఎలాంటి ప్రకటన విడుదల చేయలేదు. గతకొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. శనివారం రాత్రి తీవ్రమైన గుండెపోటు వచ్చినట్టు సీనియర్ వైద్యుడు వెల్లడించారు.

దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత అక్రమాస్తుల కేసులో శిక్షకు గురై శశికళ బెంగళూరు పరప్పన అగ్రహారం జైల్లో శిక్షను అనుభవిస్తున్న సంగతి తెలిసిందే. భర్త అనారోగ్య విషయం తెలియగానే ఆయన్ని చూసేందుకు శశికళ మళ్లీ ఒకసారి పెరోల్ కోసం పిటిషన్ దాఖలు చేశారు. ఈ మేరకు ఆమె న్యాయస్థానంలో అత్యవసర పిటిషన్ దాఖలు చేశారు.
కాలేయ వ్యాధితో బాధపడుతోన్న నటరాజన్కు గత అక్టోబరులో వైద్యులు అవయవమార్పిడి చికిత్స చేశారు. ఆ సమయంలో శశికళ తొలిసారిగా పెరోల్ పై బయటకు వచ్చారు. అయితే భర్తను చూసుకుంటానని చెప్పి బయటకు వచ్చిన ఆమె ఆసుపత్రిలో కాకుండా, రాజకీయ భేటీలకు ప్రాధాన్యం ఇచ్చారన్న ఆరోపణలు కూడా వెల్లువెత్తాయి.
ఓ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి జీవన్మృతుడైన ఓ యువకుడి కాలేయాన్ని శశికళ భర్త నటరాజన్కు వైద్యులు అమర్చారు. ఈ శస్త్రచికిత్స జరిగిన రెండు వారాల తర్వాత ఆయన హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ కూడా అయ్యారు. మళ్లీ శనివారం రాత్రి గుండెపోటు రావడంతో ఆసుపత్రి పాలయ్యారు.
నటరాజన్ ఆరోగ్య పరిస్థితి గురించి తాజాగా చెన్నైలోని గ్లెనిగ్లెస్ గ్లోబల్ ఆసుపత్రి వైద్యులు ఒక నివేదికను విడుదల చేశారు. ఆయన తీవ్రమైన ఛాతీ ఇన్ఫెక్షన్తో ఈనెల 16న తమ ఆసుపత్రిలో చేరారని, ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగానే ఉందని, వెంటిలేటర్ సాయంతో శ్వాస పీల్చుకుంటున్నారని పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications