మోడీ వద్దకు పంచాయతీ: శశికళ లేఖ, ఢిల్లీకి స్టాలిన్, 'అంత తొందరెందుకు'
చెన్నై: అన్నాడీఎంకే అధినేత్రి శశికళ మంగళవారం నాడు ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాశారు. ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి జరుగుతున్న జాప్యం గురించి ఆమె లేఖ రాయడం గమనార్హం.
ఇప్పటికే శశికళ పోయెస్ గార్డెన్లో పార్టీ సీనియర్ నేతలు, మంత్రులతో చర్చలు జరిపారు. ఈ రోజు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించాలని భావించారు. కానీ దానికి అడ్డంకులు ఎదురవుతున్నాయి.
మరోవైపు, శశికళ ముఖ్యమంత్రి పదవి చేపట్టడానికి ప్రయత్నాలు చేస్తుండటం తమిళనాడు రాజకీయాల్లో తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. ఈ విషయమై తమిళనాడు ప్రతిపక్ష నేత స్టాలిన్ ఇప్పటికే రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి లేఖ రాశారు.
జయ గురించి శశికళ చాలా దాచారు: విషప్రయోగం సీనియర్ అనుమానం
ఈ విషయంపై డీఎంకే మరింత ముందుకు వెళ్లాలని భావిస్తోంది. తమిళనాడు సీఎంగా బాధ్యతలు స్వీకరించాలనుకుంటున్న శశికళ నిర్ణయానికి వ్యతిరేకత తెలుపుతూ రేపు (బుధవారం) ఆ పార్టీ నేతలు ఢిల్లీకి బయలుదేరి ప్రధాని మోడీని కలవాలని నిర్ణయించారు. ఆమె ప్రమాణస్వీకారం వ్యవహారంపై కేంద్రం ముందు అభ్యంతరం తెలపనున్నారు.
కాగా, శశికళపై ఏఐఎల్డీఎంకే వ్యవస్థాపకులు, నటుడు టిరాజేందర్ అంతకుముందు మండిపడ్డారు. జయలలిత నివాసమైన పోయెస్ గార్డెన్లో ఆమె ఏ హక్కుతో ఉంటున్నారని నిలదీశారు.
శశికళ ఇలా హడావిడిగా ఎందుకు ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నారో చెప్పాలన్నారు. అందులో ఆంతర్యం ఏమిటన్నారు. శశికళ సీఎం కావడం ఆ పార్టీలోని వారికే ఇష్టం లేదని పేర్కొన్నారు.
దివంగత ముఖ్యమంత్రి జయలలిత పలు సందర్భాల్లో 'మక్కళాల్ నాన్..మక్కళుక్కాగవే నాన్' అని చెప్పేవారని గుర్తు చేశారు. అంటే తనకు ఎవరితోనూ ఎలాంటి బంధాలు లేవని దాని అర్థమన్నారు. అలాంటప్పుడు శశికళకు ఎలాంటి సంబంధముందని ప్రశ్నించారు. ఏ హక్కుతో ఆమె పోయెస్ గార్డెన్లో ఉంటున్నారో చెప్పాలన్నారు. జయలలిత తర్వాత అంతటి అర్హత ఉన్నవారే సీఎం బాధ్యతలు చేపట్టాలన్నారు.