డిజిటల్ మీడియాతో ‘న్యాయ’ విప్లవం -సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు -‘హత్య కేసు’పై ఈసీ పిటిషన్ కొట్టివేత
ఇంటర్నెట్ వ్యాప్తితో పెరిగిన డిజిటల్ మీడియా ద్వారా న్యాయ వ్యవస్థకు సంబంధించిన వార్తల రిపోర్టింగ్ లో విప్లవాత్మక మార్పులు వచ్చాయని, కోర్టుల రియల్ టైమ్ అప్డేట్స కూడా పత్రికా స్వేచ్ఛ కిందికే వస్తుందని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. అంతర్గత లేదా వీడియో కెమెరాల మధ్య సాగే విచారణలు తప్ప కోర్టులకు సంబంధించిన అన్ని వ్యవహారాలు రాజ్యాంగం ప్రకారం అందరికీ అందుబాటులో ఉండాల్సిందేనని, కోర్టు విచారణల లైవ్ స్ట్రీమింగ్ అవసరత కూడా పెరిగిందని, తీర్పు కాపీల్లో వాటి ప్రస్తావన లేకుండా జడ్జిలు చేసే మౌఖిక వ్యాఖ్యలను రిపోర్ట్ చేసే హక్కు మీడియాకు ఉంటుందని, అలాంటి మీడియాను కట్టడి చేయాలంటూ ఎన్నికల సంఘం(ఈసీ) కోరడం భావ్యంకాదని సర్వోన్నత న్యాయస్థానం పేర్కొంది.
అసైన్డ్ భూములపై జగన్ సంచలనం -వ్యవసాయ భూమికంటే 10శాతం ఎక్కువ పరిహారం -దేశంలో తొలిసారి ఏపీలోనే
కొవిడ్ వ్యాప్తి సమయంలో ఎన్నికలు నిర్వహించిన ఈసీపై హత్య కేసు ఎందుకు పెట్టరాదంటూ మద్రాస్ హైకోర్టు వ్యాఖ్యలు చేసిన దరిమిలా ఒక రాజ్యాంగ వ్యవస్థను ఉద్దేశించి కోర్టులు చేసే సదరు(తీర్పు కాపీల్లో ఉండని) వ్యాఖ్యలను మీడియా రిపోర్టు చేయడాన్ని కట్టడి చేయాలంటూ ఈసీ దాఖలు చేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టు గురువారం కొట్టేసింది. విచారణ సందర్భంగా న్యాయమూర్తులు చేసే మౌఖిక వ్యాఖ్యలను ప్రచురించవద్దని ఆదేశించాలని ఈసీ చేసిన విజ్ఞప్తిని కోర్టు తోసిపుచ్చింది. మీడియాను నియంత్రించడం తిరోగమన చర్య అవుతుందని జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది.
ఎన్నికల కమిషన్ బాధ్యతారాహిత్యాన్ని ఎత్తిచూపుతూ, మద్రాస్ హైకోర్టు ఏప్రిల్ 26న ఓ కేసు విచారణ సందర్భంగా తీవ్ర వ్యాఖ్యలు చేయడం, ఈసీపై హత్యా నేరం కింద కేసులు ఎందుకు పెట్టరాదంటూ జడ్జిలు మౌఖిక వ్యాఖ్యలు చేయడం తెలిసిందే. ఆ వ్యాఖ్యలను యథాతథంగా ప్రచురించడాన్ని తప్పు పట్టిన ఈసీ.. మీడియాపై ఆంక్షలు విధించాలంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించగా, చివరికి చుక్కెదురైంది. ఈ సందర్భంగా
ఇంటర్నెట్ జమానాలో డిజిటిల్ మీడియా వ్యాప్తితో కోర్టు వ్యార్తల రిపోర్టింగ్స్ పెరగడం విప్లవాత్మక ధోరణి అన్న సుప్రీంకోర్టు.. అలాంటి వార్తలపై ఆంక్షలు విధిస్తే పత్రికా స్వేచ్ఛకు భంగం కలిగించినట్లవుతుందని వ్యాఖ్యానించింది. అయితే, ఈసీపై హత్య కేసు అంశంలో మద్రాస్ హైకోర్టు చేసిన వ్యాఖ్యలు చాలా పరుషంగా ఉన్నాయని సుప్రీం అంగీకరించింది. కానీ ఈ వ్యాఖ్యలు జ్యుడిషియల్ ఆర్డర్లో లేవని, అందువల్ల వాటిని తొలగించబోమని సుప్రీం స్పష్టం చేసింది. అదే సమయంలో కోర్టు వ్యవహారాలను ప్రచురించే హక్కు మీడియాకు ఉందని, సరైన ఆలోచన లేకుండా చేసే వ్యాఖ్యలు అపార్థాలకు దారి తీస్తాయని పేర్కొంది.