రాష్ట్ర విభజనపై స్టేకు సుప్రీం కోర్టు నో, ఉండవల్లికి తలంటు
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనపై మధ్యంతర స్టే ఇచ్చేందుకు భారత దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు సోమవారం నిరాకరించింది. ఆరు వారాల్లోగా కౌంటర్ దాఖలు చేయాలని కేంద్రానికి సుప్రీం నోటీసులు జారీ చేసింది. అనంతర విచారణను ఆగస్టు 20వ తేదీకి వాయిదా వేసింది.
అదే రోజున విభజన పిటిషన్లను ఏ ధర్మాసనం విచారణ చేయాలన్న దానిసై సుప్రీం నిర్ణయం తీసుకోనుంది. విభజనపై ఇప్పుడే మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు కోర్టు నిరాకరించింది. స్టే ఇవ్వలేమని తెలిపింది.
ప్రస్తుత పరిస్థితుల్లో జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని కోర్టు పేర్కొంది. పూర్తిస్థాయి విచారణ తర్వాతే స్టే పైన నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. రాజ్యాంగ ధర్మాసనానికి నివేదించడంపై తదుపరి విచారణ తర్వాతే నిర్ణయిసస్తామని సుప్రీం కోర్టు తెలిపింది.
ఉండవల్లిపై ఆగ్రహం
అపాయింటెండ్ డేట్ వాయిదా వేసేలా ఆదేశాలు జారీ చేయాలని ఉండవల్లి అరుణ్ కుమార్ కోర్టును కోరారు. పార్లమెంటులో ప్రజాస్వామ్యం ఖూనీ అయిందని, దానికి తానే ప్రత్యక్ష సాక్షిని అని పేర్కొన్నారు. దీనిపై న్యాయమూర్తి దత్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కోర్టును చేపల మార్కెట్ చేయవద్దన్నారు.