సుప్రీం వివాదం: రంగంలోకి బార్ అసోసియేషన్, అత్యవసర సమావేశం, కీలక తీర్మానాలు
సుప్రీంకోర్టులో సంక్షోభం నేపథ్యంలో శనివారం ఎస్సీబీఏ అత్యవసరంగా సమావేశమైంది. జడ్జిల మధ్య నెలకొన్న అభిప్రాయభేదాలపై తాము దృష్టి సారించినట్టు ఎస్సీబీఏ అధ్యక్షుడు వికాస్ సింగ్ తెలిపారు.
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు జడ్జిల మధ్య నెలకొన్న అభిప్రాయభేదాలపై తాము దృష్టి సారించినట్టు సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ (ఎస్సీబీఏ) అధ్యక్షుడు వికాస్ సింగ్ తెలిపారు. సుప్రీంకోర్టులో సంక్షోభం నేపథ్యంలో శనివారం ఎస్సీబీఏ అత్యవసరంగా సమావేశమైంది.
సుప్రీం వివాదం: అభిప్రాయ భేదాలు సమసిపోతాయి, రాజకీయాలొద్దు: బార్ కౌన్సిల్ ఛైర్మన్
'సుప్రీంకోర్టులో అవాంఛనీయ ఘటనలు'.. ఏమిటవి? సీజేఐ జోక్యం మితిమీరుతోందా?
సుప్రీం కోర్టులోనూ మహిళల పట్ల వివక్ష! 67 ఏళ్లలో ఆరుగురే మహిళా న్యాయమూర్తులు
అనంతరం అసోసియేషన్ అధ్యక్షుడు వికాస్ సింగ్ మీడియాతో మాట్లాడుతూ నలుగురు న్యాయమూర్తులు శుక్రవారం పేర్కొన్నట్టు అభిప్రాయ భేదాలు ఏవైనా ఉంటే వాటిని తక్షణం పరిష్కరించాలని ఎస్సీ బార్ అసోసియేషన్ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు.
సుప్రీంకోర్టులో పాలనా పరిస్థితులు సజావుగా సాగడం లేదని, అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకుంటున్నాయని నలుగురు సుప్రీం న్యాయమూర్తులు శుక్రవారం మీడియా సమావేశం నిర్వహించిన సంగతి తెలిసిందే.
ఎన్నడూ లేని విధంగా న్యాయమూర్తులు మీడియా ముందుకు రావడం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. దీంతో శనివారం సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ సమావేశమై నలుగురు న్యాయమూర్తుల వ్యాఖ్యలకు సంబంధించి కీలక తీర్మానాలకు ఆమోదం తెలిపింది.
అవేమిటంటే.. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్తో సీనియర్ జడ్జిలకు తలెత్తిన విభేదాలను సుప్రీంకోర్టు పూర్తిస్థాయి ధర్మాసనం పరిశీలించాలి. అన్ని ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు(పిల్) ప్రధాన న్యాయమూర్తి లేదా కొలీజియంలోని న్యాయమూర్తులే పరిశీలించాలి. ఈనెల 15 కోసం లిస్ట్ చేసిన పిల్లను వేర్వేరు బెంచ్ల నుంచి కొలీజియం సభ్యులైన జడ్జిల బెంచ్కు బదిలీ చేయాలి.
ఈ విషయాలపై అవసరమైతే తాము ప్రధాన న్యాయమూర్తితో పాటు ఇతర జడ్జిలతో చర్చించేందుకు సిద్ధమని సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ ప్రకటించింది. నలుగురు న్యాయమూర్తులు లేవనెత్తిన అంశాలపై ఏ రాజకీయ పార్టీ గానీ, రాజకీయ నాయకులు గానీ మితిమీరి వ్యాఖ్యలు చేయకూడదని సూచించింది.
తాము తీసుకున్న నిర్ణయాలను సీజేఐకి పంపుతామని, సాధ్యమైనంత త్వరలో అన్ని అంశాలూ పరిష్కరించాలని తాము కోరుకుంటున్నట్టు చెప్పారు. ఎస్సీబీసీ తొలుత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని కలుస్తుందని, ఆయన కూడా తమ అభిప్రాయాలతో ఏకీభవిస్తే ఇతర జడ్జీల అపాయింట్మెంట్ కూడా తీసుకుని వారి మధ్య సమావేశాన్ని ఏర్పాటు చేస్తామని వికాస్ సింగ్ తెలిపారు.