వాళ్లు లేకుండా బిల్లు కుదరదు: సీమాంధ్ర మంత్రలు
న్యూఢిల్లీ: సీమాంధ్ర ఎంపీలపై విధించిన సస్పెన్షన్ను ఎత్తేయాలని, వారి సమక్షంలోనే తెలంగాణ బిల్లును ప్రవేశపెట్టాలని సీమాంధ్ర కేంద్రమంత్రులు లోక్సభ స్పీకర్ మీరాకుమార్ను కోరారు. ఈ మేరకు ఆదివారం రాత్రి వారు ఆమెకు లేఖ రాశారు. కేంద్ర మంత్రి కావూరి సాంబశివరావు నివాసంలో కేంద్ర మంత్రులు చిరంజీవి, కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి, జేడీ శీలం, ఎంపీలు ఉండవల్లి, లగడపాటి రాజగోపాల్, కెవిపి రామచందర్ రావు, అనంత వెంకట్రామిరెడ్డి, సాయిప్రతాప్, సబ్బం హరి, కనుమూరి బాపిరాజు, హర్షకుమార్, మాగుంట శ్రీనివాసులు రెడ్డి తదితరులు ఆదివారం రాత్రి భేటీ అయ్యారు.
ఎంపీల సస్పెన్షన్ నేపథ్యంలో పార్లమెంటులో అనుసరించాల్సిన వ్యూహంపై రెండు గంటలకు పైగా చర్చించారు. ఆ తర్వాత కావూరి మీడియాతో మాట్లాడారు. సీమాంధ్ర ఎంపీలపై సస్పెన్షన్ను ఎత్తివేయాలని, గురువారం లోక్సభలో జరిగిన ఘటనలకు సంబంధించిన వీడియో ఫుటేజ్ను, సీసీ టీవీల ఫుటేజ్ను బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ విభజనపై చర్చ జరుగుతుండగా ఆ రాష్ట్ర ఎంపీలను సస్పెండ్ చేయటం పెద్ద విడ్డూరమని, దీనిని చరిత్ర సహించదన్నారు.

విభజన విషయంలో బిల్లును అసెంబ్లీ తిప్పిపంపినా, వద్దని ఎంపీలు ఘోషించినా, జీవోఎం, కోర్ కమిటీ, పీఎం, సోనియాలందరికీ మొర పెట్టుకున్నా ఎవ్వరూ తమ మాట వినలేదన్నారు. కేంద్ర కేబినెట్లో సైతం టేబుల్ ఐటమ్గా తెచ్చి విభజనపై చర్చించేందుకు అవకాశం ఇవ్వలేదని, ఈ వైఖరి ఎంత మాత్రమూ క్షమార్హం కాదన్నారు. సహజంగా కేంద్ర మంత్రులు వెల్లోకి వెళ్లకూడదని, అయినా గత్యంతరం లేని పరిస్థితుల్లోనే తాము వెల్లోకి వెళ్లాల్సి వచ్చిందన్నారు.
సోమ, మంగళవారాల్లో కూడా తాము వెల్లోకి వెళతామని, తమ నిరసన కొనసాగిస్తామన్నారు. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం మనసు మార్చుకుని బిల్లు పెట్టడం లేదని ప్రకటించాలని, లేదంటే తాము చేసిన సవరణలు చేయాలన్నారు. లేదంటే తాము తీవ్రంగా ప్రతిఘటించక తప్పదన్నారు. ప్రస్తుతం సీమాంధ్ర నుంచి లోక్సభలో కేంద్ర మంత్రులతో పాటుగా ఎంపీలు జీవీ హర్షకుమార్, కనుమూరి బాపిరాజు, బొత్స ఝాన్సీలు మాత్రమే ఉన్నారని, తమ అభ్యంతరాలన్నిటినీ వారు స్పీకర్కు సమర్పిస్తారని తెలిపారు. బిల్లును సభలో ప్రవేశపెట్టలేదన్నదే దేశవ్యాప్తంగా ఉన్న జాతీయ పార్టీల అభిప్రాయమని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications