గొడవలొద్దని వెంకయ్య చెప్పారు: నఖ్వీ
న్యూఢిల్లీ: కేంద్రంలో అధికారంలో ఉన్న మనం పదే పదే వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తే ప్రధాని నరేంద్ర మోడీ అభివృద్ది ఎజెండాపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందని కేంద్ర పట్టణాభివృద్ది, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ఎం. వెంకయ్యనాయుడు సాటి మంత్రులతో అన్నారు.
మంగళవారం ఉదయం బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. సమావేశం ముగిసిన తరువాత కేంద్ర మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ విలేకరులతో మాట్లాడారు. అధికార పార్టీ నాయకులు ప్రయోగించే భాషపట్ల నియంత్రణ కలిగివుండాలని వెంకయ్యనాయుడు సూచించారని అన్నారు.
ప్రతి చిన్న విషయంలో ఆలోచించి మాట్లాడాలని, వివాదాస్పద వ్యాఖ్యలు చెయ్యరాదని విజ్ఞప్తి చేశారని నఖ్వీ చెప్పారు. ఇటివల జరిగిన బీహార్ శాసన సభ ఎన్నికల విషయంపై ఈ సమావేశంలో చర్చించామని వివరించారు.
మత అసహనంపై రాజకీయ చర్చల గురించి సమావేశంలో చర్చించినట్లు వెల్లడించారు. పార్లమెంట్ సమావేశాలలో మత అసహనంపై చర్చ జరుగుతున్న సమయంలో బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరగడం ప్రాధాన్యత సంతరించుకుంది.