రథయాత్రలో అపశృతి- జనం మీద కుప్పకూలిన మూడంతస్తుల బాల్కనీ
అహ్మదాబాద్: ప్రపంచవ్యాప్తంగా ప్రఖ్యాతి చెందిన ఒడిశాలోని పూరీ జగన్నాథుడి రథయాత్ర కన్నుల పండువగా కొనసాగుతోంది. అత్యంత ప్రాచీనమైన ఈ రథయాత్రను తిలకించడానికి లక్షలాదిమంది భక్తులు పూరీకి చేరుకున్నారు. ప్రతి సంవత్సరం ఆషాఢ మాసం శుక్ల పక్షం రెండో రోజున జరిగే జగన్నాథుడి రథయాత్ర- ఒక్క పూరీకి మాత్రమే పరిమితం కాదు. దేశవ్యాప్తంగా పలు నగరాల్లో వాటిని భక్తులు నిర్వహిస్తుంటారు.
గుజరాత్లోని అహ్మదాబాద్లో జగన్నాథుడి రథయాత్ర సందర్భంగా అపశృతి చోటు చేసుకుంది. భారీ సంఖ్యలో భక్తులు గుమికూడిన సమయంలో మూడంతస్తుల బాల్కనీ కుప్పకూలింది. ఈ ఘటనలో ఒకరు మరణించారు. పలువురు గాయపడ్డారు. గాయపడ్డ వారిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. వారికి అత్యవసర చికిత్సను అందిస్తోన్నారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు చెబుతున్నారు.

అహ్మదాబాద్లోని దరియాపూర్ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. తమ వీధి గుండా సాగిపోతున్న జగన్నాథుడి రథయాత్రను తిలకించడానికి వందలమంది చేరుకోవడంతో వారి బరువును బాల్కనీ తట్టుకోలేకపోయింద. ఒక్కసారిగా పెద్ద శబ్దం చేస్తూ కుప్పకూలింది. వెంటనే స్థానికులు అప్రమత్తం అయ్యారు. బాల్కనీ శిథిలాలను తొలగించారు. గాయపడ్డ బాధితులను అంబులెన్సులు, ఇతర వాహనాల ద్వారా ఆసుపత్రికి తరలించారు.
#WATCH | Eight people were injured after a portion of a building collapsed in Ahmedabad's Dariapur during the 'Rath Yatra' procession#Gujarat pic.twitter.com/bFimrWya7e
— ANI (@ANI) June 20, 2023
ఆ మూడంతస్తుల భవనం ఎదురుగా ఉన్న ప్రదేశం నుంచి జగన్నాథుడి రథయాత్రను చిత్రీకరిస్తోన్న సమయంలో అది కుప్పకూలడం రికార్డయింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. పరిస్థితులను సమీక్షించారు. గాయపడ్డ వారికి అత్యవసర చికిత్స అందిస్తోన్నామని, ప్రాణనష్టాన్ని నివారించడానికి ప్రయత్నిస్తోన్నామని పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications