అయ్యప్ప స్వాములు పోటెత్తిన వేళ.. భీకర రోడ్డు ప్రమాదం: సీసీటీవీలో రికార్డ్..
Sabarimala: కేరళ శబరిమల కొండలపై వెలిసిన అయ్యప్ప స్వామిని దర్శించుకోవడానికి భక్తులు వేల సంఖ్యలో తరలి వెళ్తోన్నారు. ఏపీ, తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున మాలధారణ చేస్తోన్నారు. నియమ నిష్ఠలతో మణికంఠుడిని కొలుస్తోన్నారు. ఇప్పటివరకు 15 లక్షలమంది వరకు భక్తులు అయ్యప్ప స్వామిని దర్శించుకున్నారు.
మండలం-మకరవిళక్కు మహాపడి పూజల కోసం అయ్యప్ప స్వామి ఆలయం తలుపులు ఈ నెల 15వ తేదీన తెరచుకున్న విషయం తెలిసిందే. దీనితో మండలం- మకరవిళక్కు సీజన్ ఆరంభమైంది. స్వామివారిని దర్శించుకోవడానికి ఏపీ, తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి వేల సంఖ్యలో భక్తులు శబరిమలకు తరలి వెళ్తోన్నారు.

అదే సమయంలో వరుస ప్రమాదాలు చోటు చేసుకుంటోన్నాయి. ఈ నెల 17వ తేదీన అయ్యప్ప స్వాముల కోసం కేరళ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఏర్పాటు చేసిన బస్సు ప్రమాదానికి గురైంది. బస్సులో మంటలు చెలరేగాయి. ఆ సమయంలో బస్సులో అయ్యప్ప స్వామి భక్తులెవరూ లేకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
19వ తేదీన మరో ప్రైవేట్ మినీ బస్సు నంబర్ కేఏ 13 డీ 7099 ప్రమాదానికి గురైంది. 50 మంది కర్ణాటకకు చెందిన భక్తులతో కూడిన బస్సు ఇది. ఈ తెల్లవారు జామున 6 గంటల సమయంలో వాయనాడ్ జిల్లాలోని తిరునెల్లి వద్ద బోల్తా పడింది. అయ్యప్ప స్వామిని దర్శించుకుని తిరుగుముఖం పట్టిన ఈ బస్సు మార్గమధ్యలో తిరునెల్లి-థెట్టు మధ్య అదుపు తప్పి పల్టీ కొట్టింది.
ఇప్పుడు మరో రోడ్డు ప్రమాదం సంభవించింది. కర్ణాటకలోని హసన్ జిల్లా తావరహళ్లికి చెందిన కొందరు భక్తులు మినీ బస్సులో అయ్యప్ప స్వామిని దర్శించుకోవడానికి శబరిమలకు బయలుదేరి వెళ్లారు. మార్గమధ్యలో ఈ బస్సు ప్రమాదానికి గురైంది. పలువురు భక్తులు స్వల్పంగా గాయపడ్డారు.
అదే నెల 26వ తేదీన కన్నూర్ జిల్లాలో అయ్యప్ప స్వాములతో కూడిన ఓ అదుపు తప్పింది. విద్యుత్ స్తంభాన్ని ఢీ కొట్టి, రోడ్డు పక్కకు దూసుకెళ్లి బోల్తా పడింది. ఈ ఘటనలో డ్రైవర్ సహా కొందరు భక్తులకు గాయాలయ్యాయి. డ్రైవర్ నిద్రమత్తులో ఉండటమే దీనికి కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.
తాజాగా అదే కన్నూర్ జిల్లాలో మరో రోడ్డు ప్రమాదం సంభవించింది. కేరళ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకు చెందిన రెండు బస్సులు ఎదురెదురుగా ఢీ కొట్టుకున్నాయి. ఈ ఘటనలో 40 మంది ప్రయాణికులు గాయపడ్డారు. వారిని సమీప ఆసుపత్రికి తరలించారు. ఎవరికీ ఎలాంటి ప్రాణాపాయం జరగలేదని డాక్టర్లు వెల్లడించారు. ఈ బస్సులో అయ్యప్ప స్వాములెవరూ లేరు.
కన్నూర్ జిల్లాలోని కల్లేరిమాల వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. మనంథవాడి నుంచి పయ్యన్నూర్ వెళ్తోన్న కేఎస్ఆర్టీసీ బస్సు ఎదురుగా వస్తోన్న మరో కేఎస్ఆర్టీసీ బస్సును ఢీకొట్టింది. ఇరిట్టి నుంచి మనంథవాడికి వెళ్తోన్న బస్సు అది. ఢీ కొట్టిన వెంటనే ఓ బస్సు కుడివైపు భాగం మొత్తం కోసుకుపోవడం కనిపించింది. దీనికి సంబంధించిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డ్ అయ్యాయి.












Click it and Unblock the Notifications