థరూర్ని సోనియా తిడితే, మోడీ ప్రశంస: ఎందుకు?
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ సీనియర్ పార్లమెంటు సభ్యుడు శశిథరూర్ను బుధవారం నాడు ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ కోప్పడితే, ప్రధాని నరేంద్ర మోడీ గురువారం నాడు పొగిడారు. థరూర్ను ప్రధాని ప్రశంసల్లో ముంచెత్తారు.
ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయంలో ఆయన సంభాషణ చాతుర్యాన్ని, అన్నింటినీ మించి సందర్భమూ, సమయాన్ని బట్టి మాట్లాడటం వంటి విషయాల్లో శశిథరూర్ చాలా గ్రేట్ అన్నారు.
బుధవారం నాడు సోనియా గాంధీ సొంత ఎంపీ శశిథరూర్ పైన మండిపడ్డారు. పార్లమెంటు సమావేశాల్లో అనుసరించిల్సిన వ్యూహంపై చర్చించే సమయంలో శశిథరూర్ తన అభిప్రాయాలను కుండబద్దలు కొట్టారు.
యూపిఏ హయాంలో బిజెపి అడ్డుకున్నరీతిలోనే పార్లమెంటు సమావేశాలను స్తంభింప చేయాలని కాంగ్రెస్ సీనియర్లు సూచించారు. దీనిపై థరూర్ వద్దన్నారు. బిజెపికి నాడు 110మంది ఎంపీలు ఉంటే, మనకు 44 మందే ఉన్నారని, అది సాధ్యం కాదని చెప్పారు. సమావేశాలు స్తంభింప చేయడం కన్నా చర్చ ద్వారా ప్రభుత్వాన్ని నిలదీయాలన్నారు. ఇది మీడియాకు లీక్ కావడంతో సోనియా ఆగ్రహం వ్యక్తం చేశారు.
శశిథరూర్ను మోడీ ఎందుకు పొగిడారు?
శశిథరూర్ ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయంలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ఆసక్తికర వాదన వినిపించారు. బ్రిటిష్ భారత్ను 200 ఏళ్లు పాలించిందని, అందుకు పరిహారం ఇవ్వాలని వాదించారు. ఇది ఇప్పుడు ఇంటర్నెట్లో హల్ చల్ చేస్తోంది.