ఒక కుటుంబం..ఇద్దరు సభ్యులు.. రెండు పార్టీలు : ఎస్పీ తీర్థం పుచ్చుకున్న ఆ హీరో భార్య
రాజకీయాల్లో ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు వేర్వేరు పార్టీల్లో ఉండటం ఇప్పుడు నయా ట్రెండ్గా కనిపిస్తోంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా ఒకే కుటుంబానికి చెందిన పలువురు రాజకీయనాయకులు వేర్వేరు పార్టీలో ఉండటాన్ని చూశాం. తాజాగా ఇదే జాబితాలో మరో కుటుంబానికి చెందిన వారు చేరిపోయారు. ఇంతకీ వారు ఎవరు...? ఏపార్టీలో వీరు జాయిన్ అయ్యారు.
రెండు వేర్వేరు పార్టీల్లో ఒకే కుటుంబ సభ్యులు
దేశవ్యాప్తంగా ఎన్నికలు వేడి బాగా కనిపిస్తోంది. ఇప్పటికే తొలిదశ విడత పోలింగ్ ముగిసింది. అయినప్పటికీ రాజకీయనాయకులు ఒక పార్టీ నుంచి మరో పార్టీలోకి వెళుతున్నారు. టికెట్ రాకపోయినప్పటికీ వారు మరో పార్టీలో చేరిపోతున్నారు. ఇదిలా ఉంటే ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు సభ్యులు వేర్వేరు పార్టీల కండువాలు కప్పుకోవడం ఇప్పుడు కొత్త ట్రెండ్గా కనిపిస్తోంది. ఈ మధ్యే బీజేపీకి గుడ్బై చెప్పేసి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు కేంద్ర మాజీ మంత్రి శతృఘ్న సిన్హా. తాజాగా ఆయన భార్య నటి పూనమ్ సిన్హా సమాజ్వాదీ పార్టీలో చేరారు. అఖిలేష్ యాదవ్ భార్య డింపుల్ యాదవ్ సమక్షంలో పూనమ్ సమాజ్వాదీ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. పూనమ్ సిన్హా లక్నో పార్లమెంటు స్థానం నుంచి సమాజ్వాదీ పార్టీ అభ్యర్థిగా కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్పై పోటీలో నిలవనున్నారు.
రాజ్నాథ్ సింగ్పై పోటీ చేయనున్న పూనం సిన్హా
ఎస్పీ-బీఎస్పీ-ఆర్ఎల్డీ పార్టీల పొత్తులో భాగంగా లక్నో సీటు సమాజ్వాదీ పార్టీకి దక్కింది. అయితే అక్కడ రాజ్నాథ్ సింగ్ను ఢీకొనే వ్యక్తి ఇప్పటి వరకు సమాజ్వాదీ పార్టీకి దొరకలేదు. ఇక పూనమ్ సిన్హా ఎస్పీలో చేరడంతో ఆ లోటు భర్తీ కానుంది. రాజ్నాథ్ సింగ్కు పూనం గట్టి పోటీ ఇస్తుందని సమాజ్వాదీ పార్టీ భావిస్తోంది.అయితే అంతకుముందు అఖిలేష్ యాదవ్ను శతృఘ్న సిన్హా కలిసి తన భార్యకు టికెట్ కేటాయించాల్సిందిగా కోరినట్లు తెలుస్తోంది. ఇక పట్నా నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా శతృఘ్నసిన్హా పోటీ చేస్తున్నారు.
బీజేపీలో పురందరేశ్వరి...వైసీపీలో దగ్గుబాటి వెంకటేశ్వరరావు
ఇక ఒకే కుటుంబం నుంచి రెండు వేర్వేరు పార్టీలో ఉన్నవారిలో ఏపీకి చెందిన మాజీ కేంద్ర మంత్రి కుటుంబం కూడా ఉంది. దగ్గుబాటి పురందరేశ్వరి బీజేపీ నుంచి విశాఖ పార్లమెంటు స్థానానికి పోటీ చేయగా... ఆమె భర్త దగ్గుబాటి వెంకటేశ్వరరావు వైసీపీ నుంచి పర్చూరు అసెంబ్లీకి పోటీ చేశారు. ఇక హిమాచల్ ప్రదేశ్ మంత్రి అనిల్ శర్మ తండ్రి సుఖ్రామ్ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. అంతేకాదు సుఖ్రాంతో పాటు అనిల్ శర్మ తనయుడు కూడా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఇక తాజాగా ప్రముఖ క్రికెటర్ రవీందర్ జడేజా భార్య బీజేపీలో ఉండగా... ఆయన తల్లిదండ్రులు కాంగ్రెస్లో ఉన్నారు. అయితే తన మద్దతు మాత్రం బీజేపీకే అని రవీందర్ జడేజా ప్రకటించారు. మొత్తానికి ఫ్యామిలీ నుంచి ఇద్దరు సభ్యులు వేర్వేరు పార్టీలో కొనసాగుతుండటం నయా ట్రెండ్గా కనిపిస్తోంది. అయితే ఇది ఎంత వరకు సక్సెస్ అవుతాయో వేచి చూడాలి.