ఎయిరిండియాపై చర్యలు తీసుకుంటా: శివసేన ఎంపీ, పార్టీ మద్దతు
శివసేన ఎంపీ రవీంద్ర గైక్వాడ్ ఎయిర్ ఇండియాపై కోర్టుకు ఎక్కాలని నిర్ణయించారు. పుణేకు తన రిటర్న్ టిక్కెట్ నిరాకరించడంతో ఆయన రైలు ద్వారా ప్రయాణించారు.
ముంబై: శివసేన ఎంపీ రవీంద్ర గైక్వాడ్ ఎయిర్ ఇండియాపై కోర్టుకు ఎక్కాలని నిర్ణయించారు. పుణేకు తన రిటర్న్ టిక్కెట్ నిరాకరించడంతో ఆయన రైలు ద్వారా ప్రయాణించారు. అలాగే, ఆయన విమానం ఎక్కకుండా బ్యాన్ చేశారు. దీనిపై కోర్టుకు వెళ్తానని ఆయన చెప్పారు.
చెప్పుతో కొట్టిన శివసేన ఎంపీకి మరో షాక్
కాగా, ఎంపీ రవీంద్ర గైక్వాడ్కు పార్టీ మద్దతుగా నిలుస్తోంది. గైక్వాడ్కు మద్దతుగా ఆయన లోకసభ నియోజకవర్గమైన ఉస్మానాబాద్లో శివసేన సోమవారం బంద్కు పిలుపునిచ్చింది. ఎయిరిండియా, ఇతర ప్రైవేటు ఎయిర్లైన్స్ నుంచి ఆయనను నిషేధించడాన్ని వ్యతిరేకిస్తూ శివసేన బంద్ చేపడుతోంది.
గైక్వాడ్ను విమానయాన సంస్థలు నిషేధిత జాబితాలో చేర్చడం పట్ల శివసేన పార్లమెంటులో ప్రివిలేజ్ మోషన్ ప్రవేశ పెట్టాలని నిర్ణయించింది. ఎయిరిండియా ఉద్యోగిని చెప్పుతో పాతిక సార్లు కొట్టినట్లు గైక్వాడ్ స్వయంగా చెప్పడమే కాకుండా, తాను క్షమాపణ చెప్పేది లేదని, అతడే తనకు క్షమాపణలు చెప్పాలని వెల్లడించడంతో దేశవ్యాప్తంగా సంచలనం రేగిన విషయం తెలిసిందే.
ఆయన ప్రవర్తనను తప్పుపడుతూ విమానయాన సంస్థలు తమ విమానాల్లో ప్రయాణించకుండా నిషేధం విధించాయి. బుధవారం లోకసభకు హాజరైన తర్వాత మీడియాతో మాట్లాడతానని, ఎయిరిండియాపై చట్టపరమైన చర్యలు తీసుకుంటానని గైక్వాడ్ వెల్లడించారు.