ఇంటి నుంచి వెళ్లిన టెక్కీ మాయం: నివాసం ఉంటున్న అపార్ట్ మెంట్ పక్కనే శవమైనాడు !
ఇంటి నుంచి బయటకు వెళ్లిన సాఫ్ట్ వేర్ ఇంజనీరు శవమై కనిపించిన ఘటన చెన్నై నగరంలోని విరుంబాక్కం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.
చెన్నై: ఇంటి నుంచి బయటకు వెళ్లిన సాఫ్ట్ వేర్ ఇంజనీరు శవమై కనిపించిన ఘటన చెన్నై నగరంలోని విరుంబాక్కం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. అరుణాచలం రోడ్డులోని జైన్స్ వెస్ట్ మినిస్టర్స్ అపార్ట్ మెంట్ లో నివాసం ఉంటున్న రాజారామ్ (44) అనే టెక్కి అనుమానాస్పదస్థితిలో మరణించాడని పోలీసులు చెప్పారు.
రాజారామ్ ప్రైవేట్ కంపెనీలో సాఫ్ట్ వేర్ ఇంజనీరుగా ఉద్యోగం చేస్తున్నాడు. ఇతను భార్య దీపా (41), కుమార్తె రక్షితతో కలిసి నివాసం ఉంటున్నాడు. మంగళవారం ఇంటి నుంచి రాజారామ్ బయటకు వెళ్లాడు. తరువాత తన భర్త రాజారామ్ కనపడలేదని దీపా పోలీసులకు ఫిర్యాదు చేశారు.
పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి విచారణ చేశారు. రాజారామ్ నివాసం ఉంటున్న అపార్ట్ మెంట్ పైప్ లైన్ ప్రాంతంలో దుర్వాసన వస్తున్న విషయం గుర్తించిన స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించి మృతిచెందింది రాజారామ్ అని గుర్తించారు.
మృతదేహాన్ని రాయ్ పేట్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. రాజారామ్ ఫోన్ లో మాట్లాడటానికి టెర్రాస్ మీదకు వెలుతుంటాడని, సిగరెట్ తాగడానికి అక్కడికే వెలుతుంటాడని, ప్రమాదవశాత్తు కాలు జారి కిందపడి మరణించాడా ? ఆత్మహత్య చేసుకున్నాడా ? హత్యకు గురైనాడా ? అని పోలీసులు ఆరా తీస్తున్నారు.
మంగళవారం ఇంటి నుంచి బయటకు వెళ్లిన రాజారామ్ ఇంటి సమీపంలోని ఏటీఎంలో నగదు డ్రా చేశాడని పోలీసుల ప్రాథమిక విచారణలో వెలుగు చూసింది. రాజారామ్ ఉద్యోగం చేస్తున్న కంపెనీలో విచారణ చేస్తున్నామని విరుంబాక్కం పోలీసు అధికారులు తెలిపారు.