''ఆప్''లో కొంత మంది ఎమ్మెల్యేలు మిస్?? బీజేపీతో టచ్లో??
దేశం మొత్తం ఇప్పుడు ఢిల్లీలోని అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వంపై దృష్టిసారించింది. ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా నివాసంలో సీబీఐ దర్యాప్తుతో దేశం దృష్టిని ఆకర్షించిన ఢిల్లీ రాజకీయాలు ఇప్పడు కీలక మలుపు తీసుకుంటున్నాయి. భారతీయ జనతాపార్టీ తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలను లాక్కునే ప్రయత్నం చేస్తోందని, ఇది తీవ్రమైన విషయమని కేజ్రీవాల్ మండిపడ్డారు. ఈరోజు అరవింద్ కేజ్రీవాల్ తన నివాసంలోనే పార్టీ నేతలతో సమావేశం నిర్వహించారు. అయితే కొంతమంది ఎమ్మెల్యేలు ఈ సమావేశానికి గైర్హాజరయ్యారని, మిస్ అయ్యారంటూ వార్తలు వెలువడ్డాయి. అయితే ఆప్ అధినేత వాదన మాత్రం భిన్నంగా ఉంది.

సమావేశానికి 53 మంది ఎమ్మెల్యేలు హాజరు
ఆప్ కు మొత్తం 62 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. కేజ్రీవాల్ నివాసంలో జరిగిన సమావేశంలో కేవలం 53 మంది ఎమ్మెల్యేలే హాజరైనట్లు తెలుస్తోంది. దీనిపై ఆప్ ఎమ్మెల్యే సౌరభ్ భరద్వాజ్ మాట్లాడుతూ నేరుగా సమావేశానికి రాలేకపోయినవారు ఆన్లైన్లో హాజరయ్యారని, స్పీకర్ విదేశాలకు వెళ్లారని, మనీష్ సిసోడియా వేరే ప్రాంతంలో ఉన్నారని వెల్లడించారు. కొంతమంది ఎమ్మెల్యేలు ఆప్ కు అందుబాటులో లేరని భారతీయ జనతాపార్టీ చెబుతుండటంపై ఆయన మండిపడ్డారు.

ఎమ్మెల్యేకు రూ.20 కోట్ల ఆఫర్
ఢిల్లీలో ఆప్ ప్రభుత్వాన్ని కూలదోసేందుకు ఎమ్మెల్యేలను తనవైపునకు లాక్కునే ఉద్దేశంతో బీజేపీ ఉందని ఆప్ ఆరోపిస్తోంది. కమలం పార్టీలో ఏరితే ఎమ్మెల్యేకు రూ.20 కోట్లు, వేరే ఎమ్మెల్యేను తీసుకొస్తే రూ.25 కోట్లు ఇస్తామని తమ ఎమ్మెల్యేలకు ఆఫర్ ఇచ్చినట్లు తెలిపింది. తమ పార్టీనుంచి 40 మంది ఎమ్మెల్యేలను దూరం చేయడానికి ప్రయత్నం చేసిందని, కానీ వారంతా తమతోనే ఉన్నారని ఆప్ అధినాయకత్వం స్పష్టం చేసింది.

ఈ తరుణంలోనే ప్రభుత్వాన్ని కూలదోయాలని..
ఢిల్లీ ప్రభుత్వం కొత్తగా తీసుకువచ్చిన మద్యం విధానంలో అవకతవకలు చోటుచేసుకున్నాయని, ఆ పార్టీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా నివాసంలో సీబీఐ అధికారులు దర్యాప్తు చేశారు. తెలంగాణతో లింకులున్నాయంటూ అక్కడ కూడా సోదాలు నిర్వహించారు. ఇటువంటి హడావిడి వాతావరణంలోనే పార్టీ ఎమ్మెల్యేలను తమవైపునకు తిప్పుకొని ఆమ్ ఆద్మీ పార్టీని కూలదోయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.












Click it and Unblock the Notifications