బంగ్లాకు చిరు మెరుగులు, రాజ్నాథ్కు, స్మృతి అడిగినా..
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ కేబినెట్ మంత్రులు లక్కీలో పడ్డారట! యూపీఏ ప్రభుత్వంలో కేంద్రమంత్రులుగా పని చేసిన పలువురు మాజీలు.. తాము ఉన్న ఇళ్లను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుకున్నారు. ఇప్పుడు వాటిల్లోకి మోడీ కేబినెట్ మంత్రులు వెళ్తున్నారు. మాజీ మంత్రి, రాజ్యసభ సభ్యుడు చిరంజీవి నివసించిన బంగ్లాలోకి హోంశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ వెళ్లనున్నారు.
చిరంజీవి యూపీఏ హయాంలో కేంద్ర పర్యాటక శాఖ మంత్రిగా పని చేశారు. ఆయన 17, అక్బర్ రోడ్డులోని బంగ్లాలో నివసించారు. సమాచారం మేరకు.. తాను నివసిస్తున్న ఈ బంగ్లాను సర్వాంగసుందరంగా తీర్చిదిద్దుకోవడానికి చిరంజీవి రూ.3 కోట్ల వరకు ఖర్చు పెట్టారట. ఇంపోర్టెడ్ మార్బుల్, వుడ్, వాల్ ప్యానెల్స్తో చిరు బంగ్లాను అద్భుతంగా పునరుద్దరించారట. డిజైనర్ బాత్రూమ్స్, కాండీలియర్స్ పెట్టారట. ఇది అత్యద్భుతంగా కనిపిస్తోంది. ఈ బంగ్లాను చిరంజీవి ఖాళీ చేయాల్సి ఉంది. ఇందులోకి రాజ్నాథ్ సింగ్ రానున్నారు.
తాను నివసిచిన 6, అక్బర్ రోడ్డులోని బంగ్లాకు నాటి మంత్రి దయానిధి మారన్ మెరుగులు దిద్దాడు. ఈ బంగ్లాను కేంద్రమంత్రి ఉమాభారతికి కేటాయించారు. బంగ్లా బాగుందని, చిన్న పనుల అనంతరం బంగ్లాలోకి మంత్రి ఉమాభారతి వెళ్తారని చెబుతున్నారు.
19, తీన్ మూర్తి మార్గ్లోని బంగ్లాలో నాటి న్యాయశాఖ మంత్రి కపిల్ సిబాల్ ఉన్నారు. దీనిని ఇవ్వాలని మోడీ కేబినెట్లోని పలువురు మంత్రులు కోరుతున్నారట. స్మృతి ఇరానీ, నిర్మాలా సీతారామన్ వంటి వారు ఈ బంగ్లా ఇవ్వాలని అడిగారు. అయితే, దీనిని పెట్రోలియ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్కు కేటాయించారు. ఈ ఇంటికి మూడు మార్గాలు ఉన్నాయట.
నందన్ నీలేకని 2, సఫ్దర్ గంజ్ లేన్ బంగ్లాలో నివసించేవారు. అతను కూడా తన బంగ్లాను సుందరంగా తీర్చిదిద్దుకున్నారు. దీనిని ఏవియేషన్ మంత్రి సిద్దేశ్వరప్పకు కేటాయించారు. ఏడుగురు మాజీ మంత్రులు ఇప్పటి వరకు తాము నివసిస్తున్న బంగ్లాలను ఖాళీ చేయలేదట.
కాగా మోడీ కేబినెట్లోని 45 మంది మంత్రులకు తాము బంగ్లాలు కేటాయించామని, అయితే, వెంకయ్య నాయుడు, సుష్మా స్వరాజ్, మేనకా గాంధీ తదితరులు తొలుత తమకు ప్రభుత్వం ఇచ్చిన బంగ్లాల్లోనే ఉండేందుకు ఆసక్తి చూపిస్తున్నారని చెబుతున్నారు. 265 మంది మాజీ ఎంపీలకు బంగ్లాలు ఖాళీ చేయాలని నోటీసు ఇచ్చారు. అందులో 43 మంది ఖాళీ చేయాల్సి ఉందట.