రేపు భారీ ప్రదర్శన: కోర్టుకు సోనియా, రాహుల్
న్యూఢిల్లీ: నేషనల్ హెరాల్డ్ కేసుకు సంబంధించిన కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ స్పందించారు. శుక్రవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ శనివారం పాటియాలా కోర్టుకు హాజరు అవుతున్నట్లు స్పష్టం చేశారు. తమకు భారత న్యాయస్థానాలపై నమ్మకముందని, కోర్టు ఆదేశాల మేరకు సహజంగానే తాను వెళ్లి తీరునానని, ఆపై ఏం జరుగుతుందో చూద్దామని ఆమె వ్యాఖ్యానించారు.
నేషనల్ హెరాల్డ్ కేసుకు సంబంధించి ఈ నెల 19వ తేదీన సోనియా, రాహుల్లు హాజరు కావాల్సిందేనంటూ పాటియాలా కోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ కేసు విచారణలో వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని సోనియా, రాహుల్ కోరగా అందుకు కోర్టు నిరాకరించింది.
ఈ నేపథ్యంలో ఈ కేసు రేపు మధ్యాహ్నాం ఒంటి గంట ప్రాంతంలో విచారణకు రానుంది. ఈ విచారణకు సోనియా, రాహుల్తో పాటు పెద్ద ఎత్తున కాంగ్రెస్ శ్రేణులు, కార్యకర్తలు సమూహంగా వెళ్లాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీలంతా శనివారం అందుబాటులో ఉండాలంటూ సూచించారు.
నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియాగాంధీ, రాహుల్ గాంధీతోపాటు కాంగ్రెస్ పార్టీ కోశాధికారి మోతీలాల్ వోరా, ప్రధాన కార్యదర్శి ఆస్కార్ ఫెర్నాండేజ్, సుమన్ దూబే, శ్యాం పిట్రోడా తదితరులు ఉన్నారు. నేషనల్ హెరాల్డ్ పత్రికకు చెందిన రూ.2,000 కోట్లను దుర్వినియోగం చేశారంటూ సోనియా, రాహుల్లపై బీజేపీ నేత సుబ్రమణ్యస్వామి 2012లో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.
ఈ కేసులో శనివారం ఢిల్లీ కోర్టుకు హాజరుకానున్న కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీలు పోలీసు అరెస్టును ఎదుర్కోవాల్సి వస్తే, బెయిలుకు దరఖాస్తు చేయరాదని నిర్ణయించుకున్నట్టు జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి.
ఈ శనివారం మధ్యాహ్నాం కోర్టుకు హాజరవుతుండగా తిరిగి ఇంటికి వస్తారా? లేదా జైలుకు వెళతారా? అన్న విషయమై కాంగ్రెస్ కార్యకర్తల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఈ కేసులో ఏన్డీఏ ప్రభుత్వం విధి విధానాలను ఎండగట్టే దిశగా జైలుకు వెళ్లేందుకైనా సిద్ధమేనని సోనియా, రాహుల్ పార్టీ వర్గాలతో అన్నట్టు సమాచారం.