బీజేపీని తరిమికొట్టండి.. అఖిలేష్ను గెలిపించండి : తనయుడి కోసం ములాయం సింగ్ తపన
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం రసవత్తంగా సాగుతోంది. గెలుపు కోసం ప్రధాన పార్టీలన్నీ ఎత్తులు పైఎత్తులతో దూసుకుపోతున్నాయి. అటు తనయుడి గెలుపుకోసం సమాజ్ వాదీ పార్టీ వ్యవస్థాపకుడు, ఆపార్టీ ఎంపీ ములాయం సింగ్ యాదవ్ రంగంలోకి దిగారు. దేశాన్ని, రాష్ట్రాన్ని నాశన చేస్తున్న బీజేపీని తరిమి కొట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారు. అఖిలేష్ యాదవ్ నేతృత్వంలోని సమాజ్ వాదీ పార్టీని గెలిపిస్తేనే రాష్ట్రానికి భవిష్యత్తు అని పేర్కొన్నారు.

యువత కలలను అఖిలేష్ నెరవేర్చగలరు
యూపీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మెయిన్ పురిలో నిర్వహించిన బహిరంగ సభలో ములాయం సింగ్ యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీజేపీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. రాష్ట్ర, దేశాభివృద్ధిలో రైతులు, యువకులు, వ్యాపారులు ప్రధాన పాత్ర పోషిస్తారని అన్నారు. వారికి అన్ని విధాలా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. యువత కలలను అఖిలేష్ యాదవ్ నేతృత్వంలోని ప్రభుత్వం మాత్రమే నెరవేర్చగలదని ఆయన అన్నారు .

తనయుడి కోసం తండ్రి తపన
2019 లోక్సభ ఎన్నికల్లో గెలిచిన తర్వాత తొలిసారిగా మెయిన్పురికి ములాయం సింగ్ యాదవ్ వచ్చారు. ఎస్పీ విజయం కోసం ప్రచారం నిర్వహంచారు. ఎన్నికల ప్రచారంలో తన రాజకీయ వారసుడు అఖిలేష్ తో సహా ఎస్పీ అభ్యర్థులందరికీ ఓటు వేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. నా భావాలను గౌరవించి అఖిలేష్ను భారీ మెజార్టీతో గెలిపించి సమాజ్వాదీ పార్టీని పటిష్టం చేయాలని అన్నారు. బహిరంగ సభకు భారీగా తరలివచ్చిన జనసందోహాన్ని చూసి సంతోషం వ్యక్తం చేశారు. యావత్ దేశ ప్రజల దృష్టి ఇప్పడు యూపీ ఎన్నికలపైనే ఉందన్నారు.

ఆశ్చర్యపరిచేలా ములాయం సింగ్ ప్రచారం
గత కొంత కాలంగా ఎస్పీ వ్యవస్థాపకుడైన ములాయం సింగ్ యాదవ్, ఆయన కుమారుడు, ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ మధ్య దూరం బాగా పెరిగిందని వార్తలు వస్తున్నాయి. అటు ఇటీవల ములాయం సింగ్ చిన్న కోడలు బీజేపీలో చేరారు. ఆ సమయంలో ఆమె ఆయన నుంచి ఆశీస్సులు కూడా తీసుకున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ములాయం సింగ్ యాదవ్ దూరంగా ఉంటారని అందరూ భావించారు. అయితే అందరినీ ఆశ్చర్యపరుస్తూ మెయిన్పురిలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. అఖిలేశ్ యాదవ్ను గెలిపించాలని కోరారు.












Click it and Unblock the Notifications