తీస్తా దంపతులకు ఊరట: అరెస్ట్ చేయొద్దన్న సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టులో గుజరాత్ పోలీసులకు ఎదురుదెబ్బ తగిలింది. గుల్బర్గ్ సొసైటీ మ్యూజియంకు సంబంధించిన నిధుల దుర్వినియోగం కేసులో సామాజిక కార్యకర్త తీస్తా సెతల్వాడ్ దంపతులకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఈ కేసులో వారిని అరెస్ట్ చేయరాదని గురువారం జస్టిస్ దీపక్ మిశ్రా, ఆదర్శ్కుమార్ గోయల్తో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం గుజరాత్ పోలీసులకు ఆదేశాలు జారీచేసింది. ఈ కేసులో పిటిషనర్పై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.
విచారణ పేరుతో వారి స్వేచ్ఛను వెంటిలేటర్ లేదా ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో పెడుతారా అంటూ కోర్టు ప్రశ్నించింది. కస్టడీలో ఉంచి విచారణ చేపట్టడానికి ఇదేమన్నా కుంభకోణమా, ఓ ఎన్జీవోకు సంబంధించిన నిధులు దుర్వినియోగం కేసు మాత్రమేనని కోర్టు వ్యాఖ్యలు చేసింది. అహ్మదాబాద్లోని గుల్బర్గ్ సొసైటీలో మ్యూజియం నిర్మాణంలో నిధులను కాజేశారని గతంలో వారిపై ఆరోపణలు వచ్చాయి.
2002లో తలెత్తిన అల్లర్లలో ఇది పూర్తిగా ధ్వంసమైంది. మ్యూజియం నిర్మాణానికి సంబంధించిన వివిద పత్రాలు, సబరాంగ్ ట్రస్ట్ అనే స్వచ్ఛంద సంస్థకు సాయం చేసిన దాతల వివరాలు, వోచర్లను తీస్తా సెతల్వాడ్, ఆమె భర్త జావేద్ ఆనంద్ సమర్పించాలని కోర్టు ఆదేశాలను వెలువరిచింది.
ఈ కేసు విచారణ ముందుకు సాగడానికి స్వచ్ఛంద సంస్థ సబ్రంగ్ ట్రస్ట్ అండ్ సిటిజెన్స్ ఫర్ జస్టిస్ అండ్ పీస్కు వచ్చిన విరాళాల వివరాలను, ఓచర్లను, డాక్యుమెంట్లను గుజరాత్ పోలీసులకు అప్పగించాలని తీస్తా సెతల్వాడ్, ఆమె భర్త జావెద్ ఆనంద్కు సుప్రీంకోర్టు ఆదేశించింది.
సెతల్వాడ్ దంపతులు విచారణకు సహకరించడం లేదని గుజరాత్ ప్రభుత్వ తరఫు న్యాయవాది మహేశ్ జెఠ్మలానీ కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. దానిపై కోర్టు స్పందిస్తూ ఒకవేళ వారు విచారణకు సహకరించకపోతే.. బెయిల్ రద్దుకు పిటిషన్ దాఖలు చేయండి అంటూ జెఠ్మలానీకి కోర్టు సూచించింది.