సీఎం కమాండోను కాల్చి చంపిన వ్యక్తి .. అసలేం జరగింది..?
మొహాలీ: పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ భద్రతా సిబ్బందిని ఓ వ్యక్తి అతి దారుణంగా కాల్చి చంపాడు. ఈ ఘటన ఆదివారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే... మొహాలీలోని ఓ డిస్కోథెక్ వద్ద పార్కింగ్ ప్రాంతంలో చరణ్ జీత్ సింగ్ అనే వ్యక్తి మరో అమ్మాయిని వేధిస్తున్నాడు. ఇది గమనించిన సుఖ్విందర్ కుమార్ అనే కమాండో చరణ్జీత్ సింగ్ను వారించాడు. అయితే చరణ్జీత్ సింగ్ భయపడలేదు. కమాండో సుఖ్విందర్ కుమార్ చరణ్జీత్ల సింగ్ మధ్య వాగ్వాదం జరిగింది. ఆ వాగ్వాదం తారాస్థాయికి చేరడంతో సహనం కోల్పోయిన చరణ్జీత్ సింగ్ సుఖ్విందర్ కుమార్పై తుపాకీతో మూడు సార్లు కాల్పులు జరిపాడు. దీంతో చరణ్ జీత్ సింగ్ అక్కడికక్కడే మృతి చెందాడు.
హత్యకు సబంధించి సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. నిందితుడు తన స్నేహితురాలైన ఓ అమ్మాయితో పాటు మరో ఇద్దరితో క్లబ్కు వచ్చినట్లు చెబుతున్నారు. ఇక ఇతర అమ్మాయిలను చరణ్జీత్ సింగ్ తాకరాని చోట తాకుతుండటంతో గొడవ ప్రారంభమైంది. ఇది గమనించిన కమాండో సుఖ్వీందర్ సింగ్ జోక్యం చేసుకుని వారించే ప్రయత్నం చేశాడు. ఇద్దరి మధ్య గొడవ ప్రారంభమైంది. ఇది తారాస్థాయికి చేరడంతో క్లబ్ అధికారులు కలగజేసుకుని చరణ్జీత్ సింగ్ను అతని మిత్రులను క్లబ్నుంచి బయటకు వెళ్లాల్సిందిగా ఆదేశించారు.
చరణ్జీత్ సింగ్ అతని స్నేహితులు క్లబ్ నుంచి బయటకు వెళ్లిపోయిన తర్వాత సుఖ్విందర్ కుమార్ కూడా బయటకు వెళ్లిపోయాడు. బయటకు వెళ్లిన చరణ్జీత్ సింగ్ అక్కడే ఉండి సుఖ్విందర్ కుమార్ కోసం వేచి చూశాడు. సుఖ్విందర్ కుమార్ బయటకు రాగానే తిరిగి గొడవ పెట్టుకున్నాడు. వెంటనే తనతో పాటు తెచ్చుకున్న తుపాకీ తీసి సుఖ్విందర్పై కాల్పులు జరిపాడు. సుఖ్విందర్ మృతి చెందాక అక్కడి నుంచి చరణ్జీత్ సింగ్ పారిపోయాడు. సుఖ్విందర్ను చంపిన వ్యక్తిని స్పష్టంగా గుర్తించినట్లు మొహాలీ ఎస్ఎస్పీ కుల్దీప్ సింగ్ చాహల్ చెప్పారు. తనతో పాటు వచ్చిన స్నేహితులను ప్రశ్నిస్తున్నామని త్వరలోనే చరణ్జీత్ సింగ్ను పట్టుకుని అరెస్టు చేస్తామని చెప్పారు. ఇప్పటికే కొన్ని టీములు చరణ్జీత్ కోసం గాలిస్తున్నాయని ఎస్ఎస్పీ కుల్దీప్ సింగ్ చెప్పారు. పార్కింగ్ స్థలంలో ఏర్పాటు చేసిన సీసీ టీవీ ఫుటేజీలను కూడా పోలీసులు పరిశీలించారు.