సునంద మృతి కేసు: పాక్ జర్నలిస్ట్ తరర్ను ఎలా ప్రశ్నిస్తారు?
న్యూఢిల్లీ: మాజీ కేంద్రమంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత శశిథరూర్ సతీమణి సునంద పుష్కర్ మృతి కేసులో ఢిల్లీ పోలీసులు పాకిస్తాన్ జర్నలిస్ట్ మెహర్ తరర్ను ప్రశ్నించేందుకు సిద్ధమయ్యారు. ఆమెను ఎలా ప్రశ్నించాలనే విషయమై ఇప్పటికే ఢిల్లీ పోలీసులు ఓ నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది.
ఆమె పాకిస్తాన్కు చెందిన జర్నలిస్టు కావడంతో ఆమెకు సమన్లు ఇవ్వడం కొంచెం ఇబ్బందితో కూడుకున్న పని. మెహర్ తరర్ విచారణ కోసం ఢిల్లీకి వచ్చేందుకు సిద్ధమైతే పెద్ద సమస్య పోతుంది. కానీ ఆమె అందుకు సిద్ధంగా లేరని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆమెను విచారించేందుకు పోలీసులు తర్జన భర్జన పడుతున్నారు.
అయితే, సునంద పుష్కర్ మృతి కేసులో దర్యాఫ్తు బృందానికి తాను సహకరిస్తానని ఆమె చెప్పారు. వారు పాక్కు వస్తే విచారించుకోవచ్చునని గతంలో చెప్పారు. ఈ కేసులో ఆమె కీలకమైన సాక్షి. అయినప్పటికీ ఆమె విచారణ కోసం భారత్ వస్తారా లేదా అనేది ఇంకా అనుమానమే.
మెహర్ తరర్ను విచారించేందుకు పోలీసుల వద్ద రెండు మూడు మార్గాలు ఉన్నాయి. మెహర్ తరర్ ఈ కేసులో నిందితురాలు కాదని, కాబట్టి ఆమె భారత్కు తప్పనిసరిగా రావాల్సిన అవసరం లేదని చెప్పారు. ఆమె సాక్షి కావడంతో ఆమెను విచారించేందుకు పలు మార్గాలున్నాయని చెప్పారు.
ఆమెను భారత్కు రావాలని చెప్పడం తొలి మార్గమని చెప్పారు. ఈ కేసులో విచారణ కోసం ఢిల్లీకి రావాలని అడుగుతామని చెప్పారు. అది కాకుంటే.. ఆమెకు ఓ క్వశ్చనీర్ పంపిస్తామని చెప్పారు. మరో మార్గం కూడా ఉందని, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆమెను విచారించేందుకు అవకాశముందని చెప్పారు.
ఈ కేసులో మెహర్ తరర్ కీలక సాక్షి అన్నారు. సునంద జీవించి ఉన్న సమయంలో పలు ఆరోపణలు చేశారని తెలిపారు. విచారణ పూర్తి అయితే ఛార్జీషీట్ దాఖలు చేస్తామన్నారు. ట్రయల్స్ సమయంలో తరర్ రావాల్సి ఉంటుందని చెప్పారు. ఈ కేసులో విచారణ విషయమై పాకిస్తాన్ ప్రభుత్వం అంగీకారం కావాల్సి ఉంటుందన్నారు.
మెహర్ తరర్ కోసం ఢిల్లీ పోలీసులు ఇప్పటికే ఓ క్వశ్చనీర్ తయారు చేశారు. శశిథరూర్తో ఉన్న సంబంధంపై ఆమెను ప్రశ్నించే అవకాశముంది. సునంద తన ట్వీట్స్లో.. మెహర్ తరర్ పైన తీవ్ర ఆరోపణలు చేశారు. ఢిల్లీ పోలీసులు తయారు చేసిన క్వశ్చనీర్లో ఇది కీలకం కానుందని తెలుస్తోంది.
అయితే, తమ మధ్య ఎలాంటి సంబంధం లేదని తరర్, శశిథరూర్ కొట్టి పారేశారు. కొద్ది రోజుల క్రితం థరూర్ను పోలీసులు విచారించారు. ఆ సమయంలో మెహర్ తరర్తో సంబంధంపై అడిగారు. వాటిని ఆయన కొట్టి పారేశారు.