సుప్రీంకోర్టు సంచలన తీర్పు- భోజ్ శాలలో శుక్రవారం నమాజ్ కు అనుమతి..!
మధ్యప్రదేశ్ లోని ధార్ జిల్లాలో ఉన్న వివాదాస్పద భోజ్ శాల-కమల్ మౌలా మసీదు ప్రాంగణంపై జరుగుతున్న విచారణ నేపథ్యంలో సుప్రీంకోర్టు (Supreme Court) ఇవాళ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. భోజ్ శాలా ప్రాంగణంలో ఉన్న కమలా మౌలా మసీదులో ముస్లింలు శుక్రవారం నమాజ్ చదువుకునేందుకు అత్యున్నత న్యాయస్థానం అంగీకరించింది. ఈ మేరకు అనుమతి ఇస్తూ ఇవాళ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే గతంలో మధ్యప్రదేశ్ హైకోర్టు ఈ ప్రాంగణాన్ని ఆలయంగా గుర్తిస్తూ ఇచ్చిన తీర్పు నిలిపివేతకు మాత్రం నిరాకరించింది.
మధ్యప్రదేశ్ లోని భోజ్శాల-కమల్ మౌలా మసీదు సముదాయాన్ని ఆలయంగా ప్రకటిస్తూ మధ్యప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే ఇచ్చేందుకు నిరాకరించిన సుప్రీంకోర్టు.. వివాదాస్పద స్థలం సమీపంలో శుక్రవారం ప్రార్థనలు చేసుకునేందుకు ముస్లింలకు మాత్రం అనుమతినిచ్చింది. సీజేఐ సూర్యకాంత్ నేతృత్వంలోని ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం ఈ మేరకు మధ్యంతర చర్యగా ప్రతి శుక్రవారం మధ్యాహ్నం 1 నుండి 3 గంటల మధ్య ఆ స్థలం సమీపంలో ప్రార్థనలు చేసుకునేందుకు ముస్లింలకు అనుమతి ఇస్తూ ఆదేశాలు వెలువరించింది.

ఇవి సున్నితమైన అంశాలని, ఉద్రిక్తతలకు దారితీసే లేదా శాంతిభద్రతల పరిస్థితిని ప్రభావితం చేసే ఎలాంటి ఉత్తర్వులను మనం జారీ చేయకూడదని సీజేఐ పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై తుది విచారణను మూడు వారాల తర్వాత చేపడతామని ధర్మాసనం తెలిపింది. అదే సమయంలో, కోర్టు ముందస్తు అనుమతి లేకుండా ఆ కట్టడంలో ఎలాంటి నిర్మాణపరమైన మార్పులు చేయకూడదని ఆర్కియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ASI)ని సుప్రీంకోర్టు ఆదేశించింది. అలాగే తాత్కాలిక చర్యగా, ఇరు పక్షాల హక్కులకు ఎటువంటి భంగం కలగకుండా ఆ స్థలానికి ఆనుకుని లేదా సమీపంలో ముస్లింలకు ప్రత్యేక స్థలాన్ని కేటాయించాలని కూడా సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ ఏర్పాటు తుది తీర్పునకు లోబడి తాత్కాలికంగా మాత్రమే ఉంటుందని ధర్మాసనం తెలిపింది.












Click it and Unblock the Notifications