ఇద్దరు ఇండియన్ ముజాహిదీన్లకు ఊరట..! సుప్రీం సంచలన తీర్పు..!
ఢిల్లీలో నమోదైన ఓ ఉగ్రవాద కేసులో 2014 నుంచి జైల్లో ఉన్న అహజర్, అన్సారీ అనే ఇద్దరు ఇండియన్ ముజాహిదీన్ కార్యకర్తలకు (Indian Mujahideen Operatives) సుప్రీంకోర్టు (Supreme Court) ఇవాళ బెయిల్ మంజూరు చేసింది. వారిని ఇంకా జైలులో కొనసాగించడం రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 కింద పొందుపరిచిన స్వేచ్ఛ హక్కును తీవ్రంగా ఉల్లంఘించడమేనని పేర్కొంది. దాదాపు 12 ఏళ్లుగా జైల్లో ఉన్న వీరిని ఈ కేసులో విచారణ త్వరగా ముగిసే అవకాశం లేని కారణంగా విడుదల చేస్తున్నట్లు జస్టిస్ విక్రమ్ నాథ్, సందీప్ మెహతాలతో కూడిన ధర్మాసనం పేర్కొంది.
2011 నవంబర్లో ఇండియన్ ముజాహిదీన్ సభ్యుడిగా ఆరోపణలు ఎదుర్కొన్న మహ్మద్ ఖతీల్ సిద్ధిఖీని అరెస్టు చేయడంతో ఈ కేసు ప్రారంభమైంది. ఢిల్లీ, దాని పరిసర ప్రాంతాలలో ఉగ్ర కార్యకలాపాలు నిర్వహించడానికి ఆ సంస్థకు చెందిన రాజస్థాన్ మాడ్యూల్ను ఏర్పాటు చేసినట్లు అతను వెల్లడించాడని ఆరోపణలు ఉన్నాయి. అతను వెల్లడించిన విషయాలు, ఇతర సమాచారం ఆధారంగా స్పెషల్ సెల్ పలువురిని అరెస్టు చేసి, భారీ పరిమాణంలో పేలుడు పదార్థాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకుంది. ఈ కేసులో విచారణ పురోగతి అత్యంత నెమ్మదిగా సాగుతోందని, అలాగే సమీప భవిష్యత్తులో ఈ విచారణ ముగిసే అవకాశం కనిపించడం లేదని సుప్రీంకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది.

వీరి సహ నిందితులలో ఒకరు ఇప్పటికే బెయిల్పై విడుదల కావడాన్ని కూడా కోర్టు పరిగణనలోకి తీసుకుంది. 2011 నవంబర్లో ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ నమోదు చేసిన కేసులో, తమకు బెయిల్ మంజూరు చేయడానికి నిరాకరిస్తూ ఢిల్లీ హైకోర్టు ఏప్రిల్లో ఇచ్చిన ఉత్తర్వును సవాలు చేస్తూ వీరు దాఖలు చేసిన వేర్వేరు పిటిషన్లపై సుప్రీంకోర్టు ఈ తీర్పు ఇచ్చింది. 2014లో రాజస్థాన్లో నమోదైన రెండు ఎఫ్ఐఆర్లతో సహా మొత్తం మూడు ఎఫ్ఐఆర్లకు సంబంధించి పిటిషనర్లను అరెస్టు చేశారని, అప్పటి నుంచి వారు కస్టడీలోనే ఉన్నారని సుప్రీంకోర్టు ధర్మాసనం తెలిపింది. రాజస్థాన్లో నమోదైన కేసులలో ఒకదానిలో, పిటిషనర్లిద్దరినీ 2021 మార్చిలో ట్రయల్ కోర్టు దోషులుగా నిర్ధారించిందని, ఆ తర్వాత వారికి విధించిన శిక్షను హైకోర్టు నిలిపివేసిందని ధర్మాసనం గుర్తుచేసింది. రాజస్థాన్లో వారిపై నమోదైన మరో కేసులో విచారణ పెండింగ్లో ఉందని, ఆ కేసులో పిటిషనర్లిద్దరికీ ఇప్పటికే బెయిల్ మంజూరైందని వెల్లడించింది.












Click it and Unblock the Notifications