బాలకృష్ణపై సుప్రీంకోర్టు సీరియస్..!
యోగా గురువు రామ్దేవ్ బాబా, పతంజలి ఆయుర్వేద సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ఆచార్య బాలకృష్ణ మంగళవారం సుప్రీంకోర్టు ఎదుట హాజరయ్యారు. తప్పుదోవ పట్టించే ప్రకటనల కేసు విచారణలో భాగంగా వారు కోర్టు ముందుకు వచ్చారు. తమ ఆదేశాలను పాటించనందుకు సుప్రీంకోర్టు వారిపై అసహనం వ్యక్తం చేయడంతోపాటు తాము తీసుకునే చర్యలకు సిద్ధంగా ఉండాలని హెచ్చరించింది. గత నెలలో బాబా క్షమాపణలు తెలపగా వాటిని స్వీకరించడంలేదని కోర్టు వ్యాఖ్యానించింది.
ఈ సందర్భంగా రామ్దేవ్ బాబా కోర్టుకు బేషరతుగా క్షమాపణలు చెప్పారు. అయితే అఫిడవిట్ లో వివరాలపై మాత్రం అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈనెల 10వ తేదీన మరోసారి వ్యక్తిగతంగా హాజరుకావాలని ఆదేశాలు జారీచేసింది. అందుబాటులో ఉన్న ఆధునిక వైద్య విధానాలపై పతంజలి ఆయుర్వేద సంస్థ తప్పుడు ప్రచారం చేస్తోందంటూ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. గత ఏడాది నవంబరులోనే కోర్టు సంస్థను మందలించింది. వ్యాధులను నయం చేస్తామంటూ తప్పుదోవ పట్టించే ప్రకటనలుకానీ, అసత్యమైన ప్రకటనలు కానీ ఇవ్వొద్దంటూ ఆదేశించింది.

అయితే ఇచ్చిన హామీని వీరిద్దరూ ఉల్లంఘించడంపై కోర్టు మండిపడింది. చర్యలు ఎందుకు తీసుకోకూడదో చెప్పాలని ప్రశ్నించింది. ఇతర వైద్య విధానాలపై ప్రభావం చూపించేలా మీడియాలో ఎలాంటి ప్రచారం చేయవద్దని హెచ్చరించింది. ఈ నోటీసులకు పతంజలి స్పందించకపోవడంతో ఎందుకు ప్రతిస్పందన దాఖలు చేయలేదంటూ ధర్మాసనం ప్రశ్నించింది. ఇద్దరూ వ్యక్తిగతంగా న్యాయస్థానం ఎదుట హాజరుకావాలని ఆదేశించింది. దీంతో పతంజలి సంస్థ కోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. న్యాయవ్యవస్థపై గౌరవం ఉందంటూ క్షమాపణలు తెలియజేసింది. దీనిలో భాగంగానే రామ్ దేవ్ బాబు, బాలకృష్ణ కోర్టు ముందుకు వచ్చారు.












Click it and Unblock the Notifications