7గురు కుటుంబసభ్యులను చంపిన ప్రేమ జంట మరణశిక్షపై సుప్రీం స్టే
న్యూఢిల్లీ: ప్రేమించిన ప్రియుడి కోసం ఏకంగా తన సొంత కుటుంబంలోని ఏడుగురు సభ్యులను హతమార్చిన కేసులో ఓ మహిళ, ఆమె ప్రేమికుడికి విధించిన మరణశిక్షను సుప్రీం కోర్టు నిలిపివేసింది. ఈ మేరకు సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది.
2008లో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఆల్మోరాలో ఈ దారుణం జరిగింది. షబ్నం అనే మహిళ తన ప్రేమను కుటుంబసభ్యులు అంగీకరించకపోవడంతో వారిని హతమార్చేందుకు కుట్రపన్ని.... ప్రియుడైన సలీంను అందుకు ప్రేరేపించింది. 2008 ఏప్రిల్ 15వ తేదీన మత్తుమందు కలిపిన పాలను కుటుంబసభ్యులంతా తాగేలా చేసింది.
ఆ తర్వాత వారిపై సలీం సాయంతో దాడి చేసి ఒక్కొక్కరిగా హతమార్చింది. చివరకు పదినెలల మేనల్లుడిని కూడా షబ్నం స్వయంగా గొంతు నులిమి చంపేసింది. ఈ కేసులో 2010లో సంబంధిత కోర్టు దోషులిద్దరికీ విధించిన మరణశిక్షను 2013లో అలహాబాదు హైకోర్టు సమర్ధించింది.
కాగా, దోషులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై జస్టిస్. ఏకే సిక్రీ, జస్టిస్ యుయు లలిత్లతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణ జరిపింది. షబ్నం, సలీంల మరణశిక్ష అమలుపై సోమవారం నిలిపివేత ఉత్తర్వులు జారీ చేస్తూ...మే 27న తదుపరి విచారణ జరపనున్నట్లు వెల్లడించింది.