కాంగ్రెసు ఎంపీలే సహకరించలేదు: టీ బిల్లుపై సుష్మా
న్యూఢిల్లీ: తెలంగాణ బిల్లుపై పార్లమెంటులో చర్చకు అధికార కాంగ్రెసు పార్టీ సభ్యులే సహకరించలేదని లోకసభలో ప్రతిపక్ష నేత, బిజెపి నాయకురాలు సుష్మా స్వరాజ్ నిందించారు. పార్లమెంటులో తెలంగాణ బిల్లుపై తమ పార్టీ చర్చించిందని, కాంగ్రెసు సభ్యులే సహకరించలేదని ఆమె శనివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు .
రాజ్యసభలో తెలంగాణ బిల్లుపై మంచి చర్చ జరిగిందని ఆమె అన్నారు. బిల్లు ఆమోదంతో తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేరిందని ఆమె అన్నారు. దేశ ప్రయోజనాలను ముఖ్యమని భావించి పార్టీలకు అతీతంగా పనిచేశామని ఆమె అన్నారు.
రైతు సమస్యలపై తాము పార్లమెంటులో చర్చించామని ఆమె అన్నారు. కాగ్, సివిసి విషయాల్లో ప్రభుత్వం ఏకపక్ష ధోరణితో వ్యవహరించిందని, ఈ పరిణామం రాజ్యాంగ వ్యవస్థల గౌరవాన్ని కూడా కాపాడలేదని ఆమె అన్నారు.
అభివృద్ధి విషయంలో కాంగ్రెసు పార్టీకి, యుపిఎ ప్రభుత్వానికి స్పష్టమైన ఆలోచనా ధోరణి లేదని ఆమె విమర్శించారు. గడిచిన లోకసభలో ధరల పెరుగుదల అంశంపై మూడు సార్లు చర్చ జరిగిందని సుష్మా అన్నారు.