ఐన్స్టీన్నే తప్పుబట్టిన స్వామి నిత్యానంద..త్వరలో కోతులు మాట్లాడతాయట
Recommended Video
E=mc^2 ఈ ఫార్ములా ఫిజిక్స్ చదివిన ప్రతిఒక్కరికి తెలుసు. "E = mc2 సాపేక్షతా సిద్ధాంతం"ప్రపంచ ప్రఖ్యాత భౌతికవిజ్ఞాన శాస్త్రజ్ఞులు మరి నోబెల్ బహుమతి గ్రహీత సర్ ఆల్బర్ట్ ఐన్స్టీన్ మహనీయులు ప్రపంచమానవాళికి అందించిన గొప్ప వైజ్ఞానిక సూత్రం. ఈ ఆధునిక శాస్త్రసాంకేతిక యుగంలో ఈ సూత్రం కీలక పాత్ర పోషిస్తోంది. ఇది ప్రపంచంలోని మేధావులే ఒప్పుకుంటున్నారు. కానీ మన దేశానికి చెందిన స్వామి నిత్యానంద మాత్రం ఇది తప్పు అని వాదిస్తున్నారు. ఆయన నిజంగానే కొంచెం తిక్క ఉంది..కానీ ఆ తిక్కకు కొంత లెక్క కూడా ఉందని అంటున్నాడు.
E=mc^2 ఏం చెబుతోంది..?
నిర్దిష్టమైన కాంతివేగం c - ( velocity of light .. c = 3×10 to the power of 5 km/sec)లో ప్రయాణించబడిన ఒకానొక ద్రవ్యరాశి m(mass) .. శక్తి E-(Energy) గా రూపాంతరం చెందుతుంది అన్న శక్తి వినిమయ మహాసూత్రాన్ని తెలియజేస్తోంది.ప్రపంచ వైజ్ఞానిక రంగాన్నే మేలుమలుపు త్రిప్పిన ఈ మహాసూత్రాన్ని ఆధారంగా చేసుకుని అణుశక్తి మొదలుకొని ఎలక్ట్రానిక్ సూపర్ కంప్యూటర్లు, గ్రహాంతర పరిశోధనల వరకూ ఆధునిక ప్రపంచంలో జరిగిన ఆవిష్కారాలు ఎన్నో, ఎన్నెన్నో ఈ సూత్రాన్ని వినియోగిస్తున్నాయి. కానీ నిత్యానంద స్వామి మాత్రం అసలు ఐన్స్టీన్ కనిపెట్టిన సూత్రమే తప్పు అని వాదిస్తున్నాడు.
స్వామి నిత్యానంద చెబుతున్నది ఏమిటి..?
E=mc^2 అనేది తప్పు అని స్వామి నిత్యానంద చెబుతున్నారు. e అనేది mc^2గా ఉండదట. "mc^2 అంటే ఏమిటి..? ఇంటెన్సిటీ కంటిన్యూటీ మధ్య తేడానే mc^2. ఎనర్జీ మరియు కంటిన్యూటీలు నాన్వెజ్ తినేవారికి ఒకలా వెజిటేరియన్ తినేవారికి మరోలా ఉంటాయి. " అని స్వామి నిత్యానంద సెలవిచ్చారు. కేవలం శాఖాహారులకు మాత్రమే ఈ ఫార్ములా అంతర్లీనం అర్థమవుతుందని నిత్యానంద భక్తులకు బోధించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నిత్యానంద వివరణ విన్న మేధావులకు మైండ్ బ్లాక్ అవుతోంది. ఫార్ములా అర్థం కాకపోతే వదిలేయాలని ఒక గొప్ప శాస్త్రవేత్త ప్రపంచానికి అందించిన సూత్రాన్ని మతానికి అంటగట్టడమేంటని నిత్యానందపై నెటిజెన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
జన్మనిచ్చే సమయంలో దేవీగా మారనున్న తల్లి
తల్లి బిడ్డకు జన్మనిచ్చే సమయం గురించి కూడా నిత్యానంద వివరించారు. బిడ్డకు తల్లి జన్మనిచ్చే సమయంలో తల్లి స్పృహ కోల్పోదని చెప్పారు. సైన్స్ చెబుతోంది అంతా అవాస్తవమేనన్నారు. బిడ్డకు తల్లి జన్మనిచ్చే సమయంలో ఆమె దేవీ అవతారంలోకి మారిపోతుందని ఈ కాషాయగురువు సెలవిచ్చారు. దేవీ బిడ్డకు జన్మనిచ్చే సమయంలో బయాలజీ, కెమిస్ట్రీ, ఫిజిక్స్ మూడు సబ్జెక్టులు చర్యలకు దిగుతాయని పేర్కొన్నారు. మరి అలా జరుగుతున్నప్పుడు స్పృహ కోల్పోదని చెప్పారు.
గంగానది మట్టితో సిలికాన్ చిప్లు తయారు చేస్తారట..!
ఈ కొత్త సైన్స్ గురు సిలికాన్ వ్యాలీ గురించి కూడా మాట్లాడారు. సిలికాన్ వ్యాలీలోని నిపుణులు త్వరలో గంగానది మట్టిని తీసుకుని ప్రయోగాలు చేస్తారని జోస్యం చెప్పారు స్వామీజీ. గంగా మట్టితో తయారైన సిలికాన్ చిప్ ప్రస్తుతం వాడుతున్న సిలికాన్ చిప్లకంటే వెయ్యి రెట్లు ఎక్కువగా పనిచేస్తుందని చెప్పారు. ఇకపై తయారయ్యే ల్యాప్టాప్లు, ఐఫోన్లలో గంగామట్టి నుంచి తయారయ్యే సిలికాన్నే వినియోగిస్తారన్నారు. మరోవైపు మ్యూజిక్ స్టోరేజ్ యాప్స్, విజువల్ స్టోరేజ్ యాప్స్ను తయారు చేసేందుకు యమున మట్టిని ఉపయోగిస్తారని నిత్యానంద స్వామీజీ చెప్పారు.
అంతేకాదు త్వరలో ఆవులు, సింహాలు, పులులు ఒక్కటేమిటి అన్ని జంతువులు స్పష్టంగా మనుషులతో మాట్లాడుతాయని చెప్పిన నిత్యానంద... అందుకోసం తాను ఓ సాఫ్ట్వేర్ను తయారు చేస్తున్నట్లు చెప్పారు. అది త్వరలోనే వస్తుందని...జంతువులు మనుషులతో మాట్లాడగలవని నిరూపిస్తానని స్వామీజీ శపథం చేశారు.
మొత్తానికి ఇన్ని విషయాలు చెప్పి స్వామీ నిత్యానంద మరోసారి వివాదాస్పదమయ్యారు.