చర్చలు జరుగుతున్నాయ్.. ఏకపక్ష మార్పులు వద్దు: చైనాకు భారత్ గట్టి హెచ్చరిక
న్యూఢిల్లీ: బలగాల ఉపసంహరణకు చర్చలు జరుగుతున్న సమయంలో లడఖ్ ప్రాంతంలోని వాస్తవాధీన రేఖ(ఎల్ఏసీ) వెంట కవ్వింపు చర్యలకు పాల్పడవద్దని చైనాకు భారత్ గట్టి హెచ్చరిక చేసింది. ఇరు దేశాలకు చెందిన సీనియర్ కమాండర్ స్థాయి అధికారులు బుధవారం ఆరు రౌండ్ల చర్చలు జరిపిన విషయం తెలిసిందే. త్వరలో మరోసారి చర్చలు జరిగే అవకాశం ఉందని తెలిపింది.
ఆగస్టు 31న చైనా బలగాలు భారత సరిహద్దులోకి చొచ్చుకొచ్చేందుకు ప్రయత్నించాయని, భారత్ గట్టిగా బదులిచ్చిందని గుర్తు చేశారు. ఈ నేపథ్యంలోనే సరిహద్దు వెంబడి బలగాల ఉపసంహరణకు పలుమార్లు ఇరు దేశాల మధ్య చర్చలు జరుగుతున్నాయి.

చర్చలు జరుపుతున్న సమయంలో స్టేటస్ కోను మార్చేందుకు చైనా ప్రయత్నించకూడదని భారత విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. అంతేగాక, సరిహద్దులో శాంతి కోసం పూర్తిస్థాయిలో బలగాల ఉపసంహరణ జరగాలని తేల్చి చెప్పింది. అయితే, మనం ముందుగా బలగాలను ఉపసంహరించుకోలేమని, తిరిగి మళ్లీ బలగాలను తీసుకురావడం కష్టంగా మారుతుందని వ్యాఖ్యానించింది.
అందుకే, ఎలాంటి కవ్వింపు చర్యలకు దిగకూడదని, ముందుగా బలగాలను ఉపసంహరించుకోవాలని చైనాను డిమాండ్ చేస్తున్నట్లు వెల్లడించింది. గత నెలలో చైనా పలుమార్లు స్టేటస్ కో మార్చేందుకు ప్రయత్నించినందని, అయితే, భారత బలగాలు గట్టిగా బదుల్లివ్వడంతో తోకముడిచిందని తెలిపింది.
జులైలో జాతీయ భద్రతా సలహదారు అజిత్ దోవల్ చైనా కౌంటర్ పార్ట్తో చర్చలు జరిపిన అనంతరం బలగాల ఉపసంహరణ ప్రక్రియ ప్రారంభమైందని, అయితే, ఆ తర్వాత కూడా చైనా కవ్వింపు చర్యలు మానలేదని వెల్లడించింది. గతవారం పార్లమెంటు వేదికగా రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ.. చైనాకు గట్టి హెచ్చరిక చేశారు. తమ దేశ సార్వభౌమత్వానికి భంగం కలిగిస్తే మాత్రం ఊరుకునేది లేదని, తాము అన్నింటికీ సిద్ధమని డ్రాగన్ దేశాన్ని హెచ్చరించారు.
కాగా, జూన్ 15న సరిహద్దు గాల్వన్ లోయ ప్రాంతంలో చైనా దొంగచాటుగా భారత సైనికులపై దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ దాడిలో 20 మంది భారత సైనికులు మరణించగా, చైనా వైపు అంతకు రెట్టింపు బలగాలు హతమైనట్లు సమాచారం. అయితే, చైనా మాత్రం తమ సైనికుల మరణాలపై ఎలాంటి వివరాలు వెల్లడించలేదు.












Click it and Unblock the Notifications