ప్రభుత్వ బడులకు అంతర్జాతీయ ప్రమాణాలు..మహిళలకు రూ.15 వేలు: కమల్ హాసన్ మేనిఫెస్టో
చెన్నై: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల గడువు సమీపిస్తోన్న కొద్దీ.. అన్ని పార్టీలూ మేనిఫెస్టోలను విడుదల చేయడంపై దృష్టి సారించాయి. ఇప్పటికే అధికార ఏఐఏడీఎంకే, ప్రతిపక్ష డీఎంకే.. తమ ఎన్నికల మేనిఫెస్టోలను విడుదల చేశాయి. తాజాగా- లోక నాయకుడు కమల్ హాసన్ తన ఎన్నికల ప్రణాళికను విడుదలను కొద్దిసేపటి కిందటే విడుదల చేశారు. ఈ ఎన్నికల తరువాత కమల్ హాసన్ సారథ్యాన్ని వహిస్తోన్న మక్కల్ నీథి మయ్యం (ఎంఎన్ఎం).. తమిళ రాజకీయాల్లో మూడో ప్రత్యామ్నాయంగా ఎదిగే అవకాశాలు ఉన్నాయంటూ వస్తోన్న వార్తల నేపథ్యంలో ఎలాంటి హామీలను మేనిఫెస్టోలో పొందుపరిచారనేది ఆసక్తికరంగా మారింది.
తాము అధికారంలోకి వస్తే.. యువతకు 50 లక్షల ఉద్యోగాలను కల్పిస్తామని కమల్ హాసన్ హామీ ఇచ్చారు. కోయంబత్తూర్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మేనిఫెస్టోను విడుదల చేశారు. అర్హత గల కుటుంబంలోని మహిళ ప్రతినెలా 10 నుంచి 15 వేల రూపాయల మేర ఆదాయాన్ని ఆర్జించేలా ఆర్థిక స్వావలంబనను కల్పిస్తామని అన్నారు. వారిలో వృత్తి విద్యా నైపుణ్యాన్ని పెంపొందించేలా చర్యలను తీసుకుంటామని అన్నారు. తమ ప్రభుత్వ హయాంలో 50 లక్షల మంది యువతకు ఉపాధి కల్పిస్తామని చెప్పారు. ఉద్యోగాలను ఎలా కల్పించాలనే విషయంపై తన వద్ద పక్కా ప్రణాళిక ఉందని పేర్కొన్నారు.

ప్రభుత్వ పాఠశాల స్థాయిని పెంచుతామని, అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చిదిద్దుతామని కమల్ హాసన్ స్పష్టం చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో కనీస వసతులు మెరుగుపడినపుడే పిల్లలు చదువుకోగలరని ఆయన వ్యాఖ్యానించారు. యువతకు ప్రత్యేక ప్రోత్సాహకాలను అందిస్తామని అన్నారు. వారికి వృత్తి నైపుణ్యంలో శిక్షణ ఇవ్వడంతో పాటు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా ఎదిగేలా బాటలు వేస్తామని కమల్ హాసన్ చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్న ట్రాన్స్కో, జెన్కో, డిస్కమ్లు, రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలు నష్టాల్లో నడుస్తున్నాయని, వాటిల్లో సంబంధిత ఉద్యోగులను షేర్ హోల్డర్లుగా చేర్చుతామని అన్నారు.
రాష్ట్రంలోని అన్ని ప్రధాన నగరాల్లో మోనో రైళ్లను అందుబాటులోకి తీసుకొస్తామని పేర్కొన్నారు. తాము రూపొందించిన ఎన్నికల మేనిఫెస్టోలోని కొన్ని అంశాలను ఏఐఏడీఎంకే, డీఎంకే కాపీ కొట్టాయని కమల్ హాసన్ విమర్శించారు. ప్రతినెలా మహిళలకు 1000 నుంచి 1500 రూపాయల మేర నగదును ఇవ్వాలనే ప్రణాళిక తమదేనని, తాను గత డిసెంబర్లోనే దీనిపై ఓ ప్రకటన చేశానని గుర్తు చేశారు. 234 స్థానాలు ఉన్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో కమల్ హాసన్ పార్టీ..తోటి నటుడు శరత్ కుమార్ స్థాపించిన ఆల్ ఇండియా సమథువ మక్కల్ కచ్చితో కలిసి పోటీ చేస్తోంది.












Click it and Unblock the Notifications