కలాం అంత్యక్రియలకు జయలలిత దూరం
చెన్నయ్: మాజీ రాష్ట్రపతి, శాస్త్రవేత్త, భారతరత్న డాక్టర్ అబ్దుల్ కలాం అంత్యక్రియలకు తమిళనాడు ముఖ్యమంత్రి కుమారి జయలలిత హాజరుకావడం లేదు. అనారోగ్యం కారణంగా తాను అబ్దుల్ కలాం అంత్యక్రియలకు హాజరుకావడం లేదని జయలలిత తెలిపారు.
అబ్దుల్ కలాం అంటే తనకు ఎంతో గౌరవమని ఈ సందర్బంగా ఆమె గుర్తు చేశారు. అబ్దుల్ కలాంతో తనకు ఉన్న సత్సంబంధాల గురించి జయలలిత గుర్తు చేసుకున్నారు. కలాం అంత్యక్రియలకు హాజరై నివాళులు అర్పించాలని తనకు ఉందని అయితే ఆరోగ్యం సహకరించడంలేదని అన్నారు.
చెన్నయ్ నుండి రామేశ్వరం 600 కిలో మీటర్ల దూరం ఉందని, అంత దూరం తాను ప్రయాణించలేనని జయలలిత తెలిపారు. అబ్దుల్ కలాం మృతికి సంతాప సూచికగా గురువారం తమిళనాడులో సెలవు ప్రకటించామని జయలలిత అన్నారు.
తమిళనాడు ప్రభుత్వం తరుఫున మంత్రులు పన్నీరు సెల్వం, వైద్య లింగం, విశ్వనాథన్ తదితరులు హాజరు కానున్నారు. అబ్దుల్ కలాం కుటుంబ సభ్యుల కోరిక మేరకు రామేశ్వరంలో కలాం అంత్యక్రియలకు స్థలం కేటాయించామని జయలిత తెలిపారు.
గురువారం రామేశ్వరంలో జరగనున్న కలాం అంత్యక్రియలకు ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తో పాటు పలువురు ప్రముఖులు హాజరు కానున్నారు. అబ్దుల్ కలాంను రెండవ సారి రాష్ట్రపతిగా చూడాలని బీజేపీతో పాటు జయలలిత చాల ఆశపడ్డారు. అయితే అప్పుడు కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉండంటం, వీరికి సరైన బలం లేకపోవడంతో అది సాధ్యం కాలేదు.