గుడ్ న్యూస్: దీపావళికి ఎక్స్ట్రా హాఫ్ డే సెలవు: సొంతూర్లకు వెళ్లడానికి వీలుగా
Deepavali 2024: ఇంకో రెండు రోజుల్లో దీపావళి పండగ రాబోతోంది. ఈ నెల 31వ తేదీన దేశవ్యాప్తంగా దీవాళీ వేడుకలు అంగరంగ వైభవంగా జరుపుకోనున్నారు ప్రజలు. కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో కలిసి ఆనందోత్సాహాల మధ్య బాణాసంచా కాల్చుతూ సందడి చేయడానికి సిద్ధమౌతున్నారు.
వేర్వేరు రాష్ట్రాల్లో వేర్వేరు పేర్లతో మూడు రోజుల పాటు ఈ పండగను జరుపుకుంటుంటారు. ఛోటీ దీపావళి, మహాలక్ష్మి వ్రతం, గోవర్ధన పూజ, భాయ్ దూజ్ వంటి శుభ కార్యాలను నిర్వహిస్తుంటారు. తోడబుట్టిన వాళ్ల క్షేమాన్ని కోరుకుంటూ భాయ్ దూజ్ను జరుపుకొనే సంప్రదాయం రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఉంది.

దీపావళి పండగకు తోడు వరుస సెలవులు రానుండటంతో నగరాలు ఖాళీ అవుతున్నాయి. తమ సొంతూళ్లకు ప్రయాణం కట్టారు ప్రజలు. ఫలితంగా ప్రయాణ ప్రాంగణాలు ప్రయాణికుల రద్దీతో కిటకిటలాడుతున్నాయి. భారీ తాకిడి నెలకొంది. ప్రత్యేకించి ఉత్తరాది రాష్ట్రాలకు వెళ్లే రైళ్లకు డిమాండ్ ఏర్పడింది.
రైల్వే స్టేషన్లల్లో ప్రయాణికుల రద్దీని నివారించడానికి అధికారులు పలు చర్యలు తీసుకున్నారు. ప్లాట్ ఫామ్లపై అదనపు సిబ్బందిని మోహరింపజేశారు. రైలు ఎక్కేటప్పుడు తోపులాట, తొక్కిసలాట సంభవించకుండా ముందు జాగ్రత్త చర్యలను చేపట్టారు. క్యూ లో నిల్చొని రైలు ఎక్కేలా ఏర్పాట్లు చేశారు.
ఈ పండగ వేడుకలను దృష్టిలో ఉంచుకుని తమిళనాడు ప్రభుత్వం మరింత వెసలుబాటు కల్పించింది. దీపావళికి అదనంగా హాఫ్ డే సెలవును ప్రకటించింది. బుధవారం నాడు మధ్యాహ్నం వరకే పని చేసేలా ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలోని అన్ని పాఠశాలలు, కళాశాలలు, ఇతర విద్యాసంస్థలకు ఈ హాఫ్ డే సెలవును వర్తింపజేసింది.
మధ్యాహ్నం నుంచి ఉపాధ్యాయులు, లెక్చరర్లు, నాన్ టీచింగ్ సిబ్బంది, విద్యార్థులు తమ సొంతూర్లకు వెళ్లడానికి వీలుగా ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ సారథ్యంలోని డీఎంకే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. గతంలో ప్రకటించిన దీపావళి సెలవులకు ఈ హాఫ్ డే హాలిడే అదనం.
పండగ రోజైన గురువారం నాడు అంటే ఈ నెల 31తో పాటు ఆ మరుసటి రోజు నవంబర్ 1న కూడా ప్రభుత్వ సెలవు దినంగా ఇదివరకే ప్రకటించిందక్కడి ప్రభుత్వం. శని, ఆదివారాలు సెలవురోజులు కావడం వల్ల వాళ్లందరూ కూడా బుధవారం మధ్యాహ్నం నుంచే తమ సొంతూర్లకు బయలుదేరి వెళ్లడానికి వీలుగా ఈ హాఫ్ డే హాలిడేను మంజూరు చేసింది.
ఒక్క చెన్నై నుంచే 1,10,745 మంది రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ బస్సుల్లో తమ స్వస్థలాలకు ఇప్పటికే బయలుదేరి వెళ్లినట్లు తెలుస్తోంది. ఇక ఈ రెండు రోజుల్లో మరో అయిదు లక్షలమంది వరకు చెన్నై నుంచి స్వగ్రామాలకు తరలి వెళ్లవచ్చనే అంచనాలు ఉన్నాయి.












Click it and Unblock the Notifications